
పన్ను మినహాయింపు ఇవ్వాలి: ఉత్తమ్
నేటి (శుక్రవారం) అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ వల్ల వస్త్ర వ్యాపారులకు చాలా ఇబ్బందులు తలెత్తనున్నాయని, అయితే కేంద్రం ఈ సమస్యపై స్పందించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: నేటి (శుక్రవారం) అర్థరాత్రి నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ వల్ల వస్త్ర వ్యాపారులకు చాలా ఇబ్బందులు తలెత్తనున్నాయని, అయితే కేంద్రం ఈ సమస్యపై స్పందించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీఎస్టీ అంశంపై తమ ఇబ్బందులను తెలిపేందుకు వస్త్ర వ్యాపారులు ఉత్తమ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. చిన్న వ్యాపారులకు పన్ను మినహాయింపు ఇచ్చేలా చూడాలని కోరారు. జీఎస్టీని తట్టుకునే స్థోమత తమకు లేదని, సింగిల్ పాయింట్లో పన్ను వేస్తే మొయ్యలేని భారమవుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో మాట్లాడి, పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరుతానని ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. మోదీ సబ్ కా వికాస్ కాదు, సబ్ కా సర్వనాశ్లా ఉంది.. త్వరలో వస్త్ర వ్యాపారులతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ జులై 3న రాష్ట్రానికి వస్తున్నారని, ఆమెకు ఓటు వేసేందుకు మజ్లిస్ మద్దతు కూడా అడుగుతామని ఉత్తమ్ తెలిపారు.