మరుగుదొడ్ల నిర్మాణాలకు యునిసెఫ్ సాయం | UNICEF aid for the construction of toilets | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్ల నిర్మాణాలకు యునిసెఫ్ సాయం

May 31 2016 2:32 AM | Updated on Mar 19 2019 6:19 PM

జిల్లాలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి యునిసెఫ్ సహాయం తీసుకుంటున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్....

కలెక్టర్ నీతూప్రసాద్

ముకరంపుర : జిల్లాలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి యునిసెఫ్ సహాయం తీసుకుంటున్నట్లు కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై యునిసెఫ్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ  యునిసెఫ్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ప్రచారం కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించి పంపాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సూర్యప్రకాశ్‌రావు, యునిసెఫ్ స్టేట్ కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ డెప్యూటీ ఈఈ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.


 భూసేకరణ వేగవంతం
అనంతగిరి, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయుటకు భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. అనంతరగిరి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న  రైతులకు ఎకరాకు రూ.6లక్షలుగా ధర నిర్ణయించినట్లు తెలిపారు. వీటికి అదనంగా రైతుల భూములలో బోర్లు, బావులు, పైపులైన్లు, తోటలుంటే వేరుగా ధర చెల్లిస్తారన్నారు. గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ పరిధిలో రెండోసారి భూములు కోల్పోతున్న రైతులకు మెట్ట భూములకు ఎకరాకు రూ.6లక్షలు, తరి భూములకు ఎకరాకు రూ.6.5లక్షలుగా ధర నిర్ణయించినట్లు చెప్పారు. స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు చంద్రశేఖర్, భిక్షానాయక్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శంకర్, నటరాజ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


గడువులోగా టైటిల్‌డీడ్ జారీ  చేయకుంటే షోకాజ్ నోటీసులు
రైతులకు గడువులోగా టైటిల్‌డీడ్‌లు జారీ చేయకుంటే షోకాజ్ నోటీస్‌లు జారీ చేస్తామని తహసీల్దార్లను కలెక్టర్ నీతూప్రసాద్ హెచ్చరించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం డయల్ యువర్ కలెక్టర్ నిర్వహించారు. శంకరపట్నం నుంచి గంగారెడ్డి మాట్లాడుతూ 6 నెలల క్రితం మీసేవలో మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా టైటీల్‌డీడ్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేయగా.. దరఖాస్తులో వివరాలు సమర్పించకుంటే మెమో ద్వారా తెలుపుతామన్నారు.ఇలా పలువురి సమస్యలకు పరిష్కారం చూపారు. కమిషనర్ కృష్ణభాస్కర్, జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, డ్వామా పీడీ గణేశ్, ఆర్డీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement