ఇద్దరు రైతుల ఆత్మహత్య | Two farmers commit suicide | Sakshi
Sakshi News home page

ఇద్దరు రైతుల ఆత్మహత్య

Oct 5 2014 2:38 AM | Updated on Sep 2 2017 2:20 PM

ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేరడిగొండ మండలం రోడ్ లఖంపూర్‌కు చెందిన ...

ఆదిలాబాద్/ మరిపెడ: ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేరడిగొండ మండలం రోడ్ లఖంపూర్‌కు చెందిన మహిళా రైతు రేంగె అనసూయ (45) తమకున్న ఐదెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, సోయాబీన్ వేశారు. కానీ, దిగుబడి ఆశించినరీతిలో వచ్చే సూచనలు కనిపించకపోవడంతో కలత చెందిన అనసూయ శుక్రవారం క్రిమిసంహారక మందు తాగింది. ఆదిలాబాద్ రిమ్స్‌కు తీసుకెళ్లగా పరిస్థితి విషమించి రాత్రి మృతిచెందింది. ఆదిలాబాద్ మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన నౌతేగేడం ప్రభాకర్(50) నాలుగెకరాల్లో పత్తి విత్తాడు. కానీ, పంట ఎదుగుదల ఆశాజనకంగా లేదు. దీనికితోడు సాగు కోసం చేసిన అప్పులు రూ.3 లక్షలకు చేరాయి. దీంతో ఆందోళన చెందిన ప్రభాకర్ శుక్రవారం క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించగా, శనివారం ప్రభాకర్ మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

మరిపెడ: విద్యుదాఘాతంతో వరంగల్ జిల్లా మరిపెడ మండలం మల్లమ్మకుంట తండాకు చెందిన మూగరైతు మృత్యువాత పడ్డాడు.  ధర్మ(50) తన పొలంలో విద్యుత్ మోటార్‌ను ఆన్ చేయడానికి వెళ్లాడు. అతడు వెళ్లే మార్గంలో 11 కేవీ విద్యుత్‌లైన్ తెగిపడింది. చూడకుండా దానిపై అడుగు వేయడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement