టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు | trs candidates finalized | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు

Apr 9 2014 3:05 AM | Updated on Aug 11 2018 4:48 PM

తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలో మొత్తం ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తొలుత రెండు స్థానాలకు, ఆ తర్వాత మరో ఆరు స్థానాలకు పేర్లు ప్రకటించింది.

 సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలో మొత్తం ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తొలుత రెండు స్థానాలకు, ఆ తర్వాత మరో ఆరు స్థానాలకు పేర్లు ప్రకటించింది. ఇల్లెందు, పాలేరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టింది.
 ఒంటరి పోరుకు సిద్ధమైన టీఆర్‌ఎస్ తొలి జాబితాలో జిల్లాలోని కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, సత్తుపల్లి నుంచి పిడమర్తి రవికి చోటు కల్పించింది. మంగళవారం విడుదల చేసిన మూడో జాబితాలో మరో అరుగురి పేర్లు ప్రకటించింది. సీపీఐ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన బాణోత్ చంద్రావతికి అనుకున్నట్లుగానే వైరా స్థానం ఖరారైంది.

 ఆమె ఖమ్మం, వైరా నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవడంతో ఎక్కడ నుంచి టికెట్ ఆశిస్తారోనని చర్చకు దారి తీసింది. చివరకు ఆమె కోరిక ప్రకారం పార్టీ అధినేత కేసీఆర్ వైరా స్థానం ఇచ్చారు. అలాగే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం పట్టణానికి చెందిన ఎస్‌బీ బేగ్‌ను ప్రకటించారు. ఖమ్మం అసెంబ్లీ నుంచి విద్యావేత్తగుండాల క్రిష్ణ, మధిరకు బొమ్మెర రాంమూర్తి, అశ్వారావుపేట నుంచి జె.ఆదినారాయణ, పినపాకకు డాక్టర్ శంకర్‌నాయక్, భద్రాచలం అసెంబ్లీ స్థానానికి ఝాన్సీరాణి పేర్లను ప్రకటించారు.  మహహూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సీతారాంనాయక్‌కు కేటాయించారు. ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని తొలుత పార్టీ నేత ఎస్‌బీ బేగ్ ఆశించారు. అయితే స్థానిక విద్యావేత్త గుండాల క్రిష్ణ (ఆర్జేసీ) పార్టీలో చేరడంతో ఖమ్మం టికెట్ ఆయనకు కేటాయించి, బేగ్‌ను పార్లమెంట్ బరిలోకి దించారు.

 ఇల్లెందు, పాలేరుకు ఆశావహులు..
 నామినేషన్‌కు ఇక ఒకరోజే గడువు ఉండడంతో ఇల్లెందు, పాలేరు స్థానం కోసం చాలా మంది ఆశావహులు రాజధానిలో మకాం వేశారు. ఈ సీట్ల విషయంలో నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులు టికెట్ ఆశిస్తున్నా... జిల్లాలో పట్టున్న నేతలను బరిలోకి దించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. అసలు ఈ రెండు స్థానాలు ఎవరికి కేటాయిస్తారోనని మంగళవారం ఆపార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. చివరకు జలగం చెప్పిన వారికే ఈ రెండు స్థానాలు కేటాయిస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement