రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి | Three died in road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

Dec 8 2014 3:14 AM | Updated on Aug 30 2018 3:58 PM

జాతీయ రహదారిపై మునగాల శివారు సాగర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

బరాఖత్‌గూడెం(మునగాల):  జాతీయ రహదారిపై మునగాల శివారు సాగర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని బరాఖత్‌గూడెంకు చెందిన కత్తి గురవయ్య(65) వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ. ఆదివారం గేదెలను ఇంటికి వెళ్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకట్టడంతో గురవయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బాధిత కు టుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. మృతుడి కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు.   
 
   టాటా ఏస్ ఢీకొని మహిళ...
 అక్కలదేవిగూడెం(చివ్వెంల) :  టాటా ఏస్ వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని అక్కల దేవిగూడెంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కలదేవిగూడెంకు చెందిన పిడమర్తి కాశమ్మ(40) పొలం దగ్గర నుంచి పశువులను తోలుకొని ఇంటికి వస్తుండగా సూర్యాపేట-ఖమ్మం రహదారిపై ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తున్న టాటా ఏస్ వెనుక నుంచి ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన కాశమ్మను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో  నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ  నర్సింహరావు తెలిపారు.
 
   రామన్నపేట సమీపంలో యువకుడు..
 రామన్నపేట : ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి  ఐడియల్ శివారులో చోటు చేసుకుంది.  ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం కాచారం పంచాయతీ ఆవాస గ్రామానికి చెందిన జంగిడి రాంబాబు(22) చిట్యాలలోని ఓ హోటల్‌లో గుమస్తాగా పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో  శనివారం రాత్రి 2 గంటల సమయంలో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు.   చిట్యాల-భువనగిరి రహదారిపై ఐడియల్ కంపెనీ దాటిన తరువాత మూల మలుపువద్ద ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.  రోడ్డు పక్కన పార్క్ చేసిన లారీ ఇండికేటర్స్ వేసి ఉంచకపోవడం, చీకట్లో వాహనం కనిపించకపోవడం మూలంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తుంది. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement