దశాబ్దాల కాలం నాటి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు.
- ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి
వనపర్తిరూరల్, న్యూస్లైన్: దశాబ్దాల కాలం నాటి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాగవరంలో వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ ప్రాంతంలో పార్టీ నష్టపోతుందని తెలిసినా ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి, ప్రక్రియను పూర్తి చేయించారని గుర్తు చేశారు. అలాంటి తెలంగాణ తల్లికి ఓటుతో రుణం తీర్చుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలు మాట మనుషులు, విశ్వాసం కలవారని నిరూపించుకోవాలంటే గతంలో ఎన్నడూ రానన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, వనపర్తి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కళాకారుల జనపద పాటలకు కార్యకర్తలతో కలిసి చిన్నారెడ్డి స్టెప్పులు వేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్ప్రసాద్, పసుపుల తిరుపతయ్య, కృష్ణానాయక్, రాజేంద్రప్రసాద్, సత్యారెడ్డి, జానకిరాంరెడ్డి, సహదేవ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.