వివక్షకు గురైన తెలంగాణ పండుగలు | Telangana festivals discrimination to the victim | Sakshi
Sakshi News home page

వివక్షకు గురైన తెలంగాణ పండుగలు

Aug 4 2014 4:03 AM | Updated on Sep 2 2017 11:19 AM

అరవై ఏళ్లుగా తెలంగాణలోని పండుగలు వివక్షకు గురయ్యాయని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

 తూప్రాన్: అరవై ఏళ్లుగా తెలంగాణలోని పండుగలు వివక్షకు గురయ్యాయని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తూప్రాన్‌లో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ తెలంగాణ బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సీమాంధ్రుల పాలనలో వివక్షకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించారన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎలాగైతే ఉద్యమించామో  అలాగే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిట్టిమిల్ల శివ్వమ్మ, ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, వార్డు సభ్యులు ఆంజాగౌడ్, షఫీ, మన్నేశ్రీనివాస్, నరేష్, రాజు, సలాక రాజేశ్వర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

 లయన్‌‌స సేవలు ఆదర్శనీయం
 మెదక్:  ప్రపంచంలో సేవను మించిన సుగుణం లేదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ మెదక్ మంజీరా ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా అవార్డ్స్ నైట్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లయన్స్‌క్లబ్ సేవలకు గుర్తింపు ఉందన్నారు.

 హరిత తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగానే లయన్స్ క్లబ్ సుమారు 2.50లక్షల మొక్కలు నాటడం హర్షనీయమన్నారు. రూ.2కోట్లతో వికలాంగులకు వివిధ రకాల పరికరాలు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత లయన్స్‌క్లబ్‌కే సొంతమన్నారు. లయన్స్ సేవలు చూస్తుంటే తనకు కూడా క్లబ్‌లో పూర్తిస్థాయి సేవాకార్యక్రమాలు చేపట్టాలనిపిస్తోందన్నారు.

 అంతకు ముందు పద్మాదేవేందర్‌రెడ్డి వికలాంగులకు వివిధ పరికరాలు అందజేశారు. అనంతరం లయన్స్‌క్లబ్ వారు ఆమెను ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ మల్టిపుల్ కౌన్సిల్ అధ్యక్షులు బాబురావు, జిల్లా గవర్నర్లు సునీతా ఆనంద్, జనార్దన్‌రెడ్డి, జిల్లా వైస్ ప్రథమ గవర్నర్ రాజ్‌కుమార్, 2వ వైస్ గవర్నర్ ఓబుల్ రెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సురేందర్, కేబినెట్ కార్యదర్శి రమణరాజు, కోశాధికారి అమర్‌నాథ్‌రావు, లయన్స్‌క్లబ్ ఆఫ్ మెదక్ మంజీరా అధ్యక్షుడు రాంకిషన్, కార్యదర్శి నాగరాజుగౌడ్, కోశాధికారి శ్రీనివాస్‌తోపాటు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement