ఆగిపోయిన విద్యా ప్రణాళికలు! | Stopped the educational plans! | Sakshi
Sakshi News home page

ఆగిపోయిన విద్యా ప్రణాళికలు!

Feb 1 2018 1:56 AM | Updated on Feb 1 2018 1:56 AM

సాక్షి, హైదరాబాద్‌: విద్యాశాఖలో కీలకమైన పలు విద్యా పథకాల ప్రణాళికలు ఆగిపోయాయి. సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ), టీచర్‌ ఎడ్యుకేషన్‌ పథకాల విలీన నిర్ణయం నేపథ్యంలో ఆయా పథకాల కింద రూపొందించాల్సిన 2018–19 విద్యా సంవత్సరం ప్రణాళికలను రాష్ట్ర విద్యా శాఖ నిలిపివేసింది. వాస్తవానికి ఈ నెల 13 నుంచి ఆయా పథకాలకు సంబంధించిన ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు (పీఏబీ) సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.

మూడు విద్యా పథకాల విలీనం కారణంగా కేంద్రం ఆయా పీఏబీల సమావేశాలను రద్దు చేసింది. దీంతో విద్యా శాఖ సైతం వాటికి అవసరమైన ఆర్థిక సంవత్సరపు ప్రణాళికల రూపకల్పనను నిలిపివేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన పథకాల విలీనం సమావేశంలో అన్ని రాష్ట్రాలు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం గురువారం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో కొత్త పథకం పేరును ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యా పథకాలు, వాటికి అవసరమయ్యే ప్రణాళికలు, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విద్యా శాఖ భావిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement