5న స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభం | Smart andhra pradesh to be declared on January 5 | Sakshi
Sakshi News home page

5న స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభం

Dec 14 2014 3:07 AM | Updated on Jul 26 2019 5:58 PM

ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, స్మార్ట్ విలేజ్ పథకాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 5న ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

1న దత్తత గ్రామాల కేటాయింపు  
అధికారులతో సీఎం సమీక్ష


సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ ఆంధ్రప్రదేశ్, స్మార్ట్ విలేజ్ పథకాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 5న ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కొత్త ఏడాది ప్రారంభం రోజైన జనవరి ఒకటో తేదీన దత్తత తీసుకున్న వారికి గ్రామాలను కేటాయిస్తామని చెప్పారు. తన కలల ప్రాజెక్టు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌కు వర్కింగ్ మాన్యువల్‌ను వెంటనే సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా స్మార్ట్ విలేజికి సంబంధించిన దత్తత ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. శనివారం సాయంత్రం తన నివాసంలో ప్రణాళిక, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ పథకాన్ని సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, విద్య, వైద్యం, రోడ్లు, పక్కా గృహాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కొత్త ఆలోచనలతో డాక్యుమెంట్ రూపొందించాలని ప్రణాళికా శాఖను ఆదేశించారు.అనుసరించాల్సిన వర్కింగ్ మాన్యువల్‌ను తక్షణం సిద్ధం చేయాలన్నారు.
 
స్మార్ట్ నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగంలో 22 మిలియన్ యూనిట్ల కొరత నుంచి మిగులు విద్యుత్ సాధించే దిశగా అభివృద్ధి సాధించామని చెప్పారు. ప్రభుత్వ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, ఎన్‌ఆర్‌ఐలు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఎన్‌జీవోలు, సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కార్యక్రమం కింద కార్పొరేట్ సంస్థల మాదిరిగా గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, రైతు ఉపశమన పథకం, పింఛన్లు, ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగించటం తదితర కార్యక్రమాల ద్వారా గ్రామీణాభివృద్ధికి ఈ ఆరు నెలల కాలంలో జరిగిన కృషిని సీఎం వివరించారు. స్మార్ట్ హెల్త్ కేర్, స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్  ఎడ్యుకేషన్, స్మార్ట్ ఇన్‌ఫ్రా, స్మార్ట్ సిటి జన్, స్మార్ట్ విలేజ్‌లపై అధికారులు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను ఆయన తిలకించారు.

Advertisement
 
Advertisement
Advertisement