ఆరుగురు రైతుల ఆత్మహత్య | Six farmer suicides | Sakshi
Sakshi News home page

ఆరుగురు రైతుల ఆత్మహత్య

Aug 4 2017 4:19 AM | Updated on Nov 6 2018 8:08 PM

అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

సాక్షి నెట్‌వర్క్‌: అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం భూతాయి(కే) పరిధి మాన్కపూర్‌కు చెందిన రైతు బాంద్రే అమర్‌సింగ్‌(20) వర్షాలు లేక సాగు చేసిన సోయ పంట వాడిపోయింది.

రూ. 2 లక్షల వరకు అప్పులు తీర్చలేక బుధవారం  పురుగుల మందు తాగాడు. నిజామాబాద్‌ జిల్లా వెల్కటూర్‌ జీపీ పరిధిలోని నడిమితండాకు చెందిన రైతు నూనవత్‌ అమర్‌సింగ్‌ (37) వర్షాలు లేక పంటలు గట్టెక్కే పరిస్థితి లేదని కుంగి బుధవారం ఉరివేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలానికి చెందిన రైతు బడుగుల వీరస్వామి(36)  వ్యవసాయ పెట్టుబడులకు రూ.5.50 లక్షల వరకు అప్పులు చేశాడు.

సరిగా దిగుబడి రాకపోవడంతో గురువారం ఉరి వేసుకున్నాడు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుల్లకు చెందిన బొమ్మ బాలమల్లు(45) కూతురు వివాహానికి, ఇంటి నిర్మాణానికి అప్పు చేశాడు. పంటల దిగుబడి తగ్గడంతో అప్పు తీరే మార్గం కనిపించక గురువారం ఉరి వేసుకున్నాడు. వికారాబాద్‌ జిల్లాలోని బూర్గుపల్లికి చెందిన గంగారం నర్సింలు(28) సాగుచేసిన పత్తి, మొక్కజొన్న వర్షాలు లేక ఎండిపోయాయి. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు రూ. 3 లక్షలకు చేరాయి. అప్పు తీరే మార్గం కనిపించక గురు వారం పురుగుల మందు తాగాడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం జాఫర్‌గూడెం శివారు రామన్న గూడెంకు చెందిన రైతు పేరబోయిన వీరస్వామి(35) సాగుకోసం చేసిన రూ. 3 లక్షల అప్పు తీరే మార్గం కనిపించక గురువారం పురుగుల మందు తాగాడు.

Advertisement
 
Advertisement
Advertisement