పంచాయతీ కార్మికుల కష్టానికి ఫలితం  

Salary Hike For Panchniayat Workers In Telangana - Sakshi

వేతనాల పెంపు జీవో జారీ 

సాక్షి, బాల్కొండ: పెంచిన వేతనాల అమలుకు జీవో జారీ కావడంతో గ్రామ పంచాయతీల్లోని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నారు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వాటర్‌మెన్, ఎలక్ట్రీషియన్‌లకు ప్రతి నెలా రూ.8,500 వేతనం చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులను జారీ చేసింది.

మన ఊరు మన ప్రణాళిక అమలులో భాగంగా పంచాయతీ కార్మికుల వేతనాలను పెంచుతూ రెండు నెలల కిందనే నిర్ణయం తీసుకున్నా ఉత్తర్వులను మాత్రం నిన్న జారీ అయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1,057 పంచాయతీల్లో పని చేస్తున్న సుమారు 4,500 మంది కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. పంచాయతీల్లో పని చేసే కార్మికులకు గతంలో అతి తక్కువగా వేతనాలను చెల్లించారు.

పంచాయతీల్లో ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్మికులకు వేతనాలను నిర్ణయించారు. అలా ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు అం దాయి. రూ.2వేల నుంచి రూ.4వేల లోపు వేతనం అందడంతో కార్మికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు వేతనాలను పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తూ పలుమార్లు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రభుత్వం కార్మికులకు పలుమార్లు హామీ ఇచ్చినా వేతనాలను మాత్రం పెంచలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో పాటు పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా పంచాయతీ కార్మికులకు వేతనాలను పెంచుతు నిర్ణయం తీసుకుంది. అయితే కార్మికులకు వేతనాల చెల్లింపు భారాన్ని మాత్రం పంచాయతీలపైనే ప్రభుత్వం మోపింది. పంచాయతీల్లో ఆదాయం తక్కువగా ఉంటే కార్మికుల వేతనాల కోసం స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా వచ్చే నిధుల నుంచి వినియోగించుకునే వీలు ఉంది. కాగా కార్మికులకు పెంచిన వేతనాలను ఏ విధంగా చెల్లించాలని అనే విషయంపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది.

మార్గదర్శకాలు జారీ అయితేనే వేతనాల చెల్లింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తమకు ఏ విధంగానైనా పెంచిన వేతనాలను చెల్లిస్తే అదే పదివేలు అని కార్మికులు చెబుతున్నారు. కాగా పెంచిన వేతనాన్ని వెంటనే అమలులోకి తీసుకువచ్చి చెల్లింపులు జరుపాలని పలువురు కోరుతున్నారు. సుదీర్ఘ కాలంగా జరిపిన పోరాటంతోనే ప్రభుత్వం దిగివచ్చి వేతనాలు పెంచిందని కార్మిక నేతలు పేర్కొన్నారు.

కార్మికుల సంబురాలు
ఫోరాట ఫలితమే గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాల పెంపు జీవో విడుదల అయ్యిందని మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం ఎదుట సంబురాలు చేశారు. కార్మికులు బాణ సంచా కాల్చారు. స్వీట్లు పంచారు. ఈ సం దర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధానకార్యద ర్శి నూర్జహాన్‌ మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు వేతనా లు పెంచాలని ఆందోళనలు చేశారని అన్నా రు. సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు కొక్కండ, అశోక్, నందు, సూరం రవి పాల్గొన్నారు.

వేతనం ప్రతినెలా చెల్లించాలి 
రెండు నెలల కిందనే ప్రభుత్వం మాకు వేతనాలను పెంచింది. అయితే ఇప్పుడు జీవో జారీ అయ్యింది. మాకు రెండు నెలల నుంచి పెంచిన వేతనం అమలు చేయాలి. వేతనంను ప్రతి నెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. 
– గజ్జెల మధు, పారిశుద్ధ్య కార్మికుడు, ధర్మోరా     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top