రూ.20 కోట్లతో ఏడుపాయల అభివృద్ధి | Rs 20 crore for the development of Edupayala | Sakshi
Sakshi News home page

రూ.20 కోట్లతో ఏడుపాయల అభివృద్ధి

Feb 18 2015 12:41 AM | Updated on Aug 15 2018 9:27 PM

ఏడుపాయల అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు.

పాపన్నపేట : ఏడుపాయల అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి దుర్గమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన ఒడిబియ్యం పోసి ఏడుపాయల జాతరను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ లక్షలాది భక్తుల కొంగుబంగారమైన ఏడుపాయల అభివృద్ధి కోసం రూ.20కోట్లు మంజూరు చేసి ఏడాదిలోగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా ఏడుపాయలను తీర్చిదిద్దుతామన్నారు.

తెలంగాణ రాష్ర్టంలో జరుగుతున్న మొదటి జాతర కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. కోటి విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి, జాన పదుల విశ్వాసాలకు నిలయమైన జాతరను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నెల రోజులుగా జాతర నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందన్నారు. జల సమాధులు జరగకుం డా ఉండడానికి నది ఒడ్డున ఫౌంటెన్లు ఏర్పాటు చేశామన్నారు. రూ.5.25 కోట్లతో ఏడుపాయలకు రోడ్డు వెడల్పు, రూ.25లక్షలతో ఆలయం ముందు కొత్తగా బ్రిడ్జి నిర్మించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది వరకు  ఏడుపాయల రూపురేఖలు  మారిపోతాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement