ఇక టీచర్లకూ రేటింగ్! | rating for teachers in sarva shiksha abhiyan | Sakshi
Sakshi News home page

ఇక టీచర్లకూ రేటింగ్!

Sep 21 2014 11:47 PM | Updated on Oct 16 2018 3:12 PM

జిల్లాలో 1,974 ప్రాథమిక, 423 ప్రాథమికోన్నత, 502 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 2,899 పాఠశాలలు ఉన్నాయి.

మెదక్: జిల్లాలో 1,974 ప్రాథమిక, 423 ప్రాథమికోన్నత, 502 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 2,899 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 11 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం కింద విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ సర్వశిక్షా అభియాన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల స్థాయి నుంచి  ప్రధానోపాధ్యాయుల వరకు వారి సామర్థ్యాలు, పనితీరు అంచనా వేసేందుకు క్వార్టర్లీ మానిటరింగ్ టూల్స్‌ను రూపొందించారు. దీనికింద పాఠశాల మానిటరింగ్, విద్యార్థి ప్రమాణాలతోపాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరును ప్రతి మూడు నెలలకోసారి ఆన్‌లైన్‌లో ఉంచుతారు. స్కూల్ మానిటరింగ్ కింద పాఠశాల వివరాలు, ఎస్సీ, ఎస్టీల పిల్లల చదువులు, పాఠ్యేతర అంశాలు, వినూత్న పథకాలు, లైబ్రరీ వినియోగం తదితర అంశాలను నమోదు చేస్తారు.

విద్యార్థి పెర్ఫార్మెన్స్ కింద సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ న మోదు చేస్తారు. అలాగే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పెర్ఫార్మెన్స్ నమోదులో 7 అంశాలుంటాయి. ఒక్కో అంశానికి గరిష్టంగా 4 రేటింగ్ పాయింట్‌లు ఉంటాయి. వీటిని మొదట ఉపాధ్యాయుడు తనకు సంబంధించిన రేటింగ్‌ను తానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వీటిని ప్రధానోపాధ్యాయులు, పాఠశాలకు వచ్చే పర్యవేక్షణాధికారులు మూల్యాంకనం చేస్తారు. ఈ మేరకు ప్రతి మూడు నెలలకోసారి ఏడాదికి నాలుగుసార్లు ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుంది.

జూన్ నుంచి ఆగస్టు వరకు మొదటి క్వార్టర్, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 2వ క్వార్టర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 3వ క్వార్టర్, మార్చి నుంచి మే వరకు 4వ క్వార్టర్‌ను నమోదు చేస్తారు. గతంలో ఉపాధ్యాయుల పనితీరుపై ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ పంపేవారు. కాని 20 యేళ్లుగా అలాంటి రిపోర్టులకు మంగళం పలికారు. అయితే ప్రస్తుతం రేటింగ్ విధానంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ పనితీరును బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులు కూడా తగిన సూచనలిచ్చే ఆస్కారం ఉంటుంది.

 విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశం
 క్వార్టర్లీ మానిటరింగ్ టూల్స్ ఆన్‌లైన్ ఆధారంగా విద్యా ప్రమాణాలుపెరిగే ఆస్కారం ఉంది. ప్రతి ఉపాధ్యాయుడు తన పనితీరును, నైపుణ్యాలను బేరిజు వేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సెకండ్ క్వార్టర్ ఈ నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు మండలాలవారీగా సమావేశాలు ఏర్పాటుచేసి ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement