చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు | Sakshi
Sakshi News home page

చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు

Published Wed, Oct 1 2014 2:45 AM

people concern essentials prices

డిచ్‌పల్లి : తెలంగాణ ప్రజలకు దసరా పెద్ద పండుగ. ఇంటిల్లిపాదికీ  కొత్త బట్టలు కొనడం, వివిధ రకాల పిండివంటలు చేసుకోవడం, ప్రత్యేక పూజలు, బంధుమిత్రులకు విందు భోజనాలు, శరన్నవరాత్రుల సంబురాలు, సరదాలు ఉంటాయి. అలాంటి దసరా జోరు ఈసారి తగ్గనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి పండుగ కావడంతో ఆనందంగా ఉన్నా, చుక్కలనంటిన నిత్యావసరాల ధరలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

 దీనికి తోడు ఈసారి సకాలంలో వానలు కూడా కురియలేదు. చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నా యి. పంటలు ఆలస్యంగా వేయడంతో ఇంకా దిగుబడి చేతికందలేదు. ఓ వైపు చేతికందని పంట, మ రోవైపు పెరిగిన ధరలు, అదే సమయంలో పండుగలు రావడం సామాన్యులను కలవరపెడుతున్నా యి.

దసరా వచ్చిందంటే చాలు ఇంట్లో ఉండే చిన్నా, పెద్దా అందరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. పేద, ధనిక అన్న తేడా లేకుండా ఇం ట్లో అందరికీ కొత్తబట్టలు కావాల్సిందే. ఎంత చిన్న కుటుంబమైనా కనీసం నలుగురికి తక్కువ ఉండని ఈ కాలంలో పిల్లలు రెడిమేడ్ దుస్తులే కావాలని పట్టుబడుతుంటారు. పం డుగ సీజన్లలో దుస్తుల రేట్లు పెరిగిపోతాయి. ఒకవైపు మార్కెట్లో  డిస్కౌంట్ల పేరు చెప్పినా, పిల్లల డ్రస్సుకు ఎంత లేదన్నా రూ. 1,500 నుంచి రూ. 2,000కు తగ్గకుండా ఉన్నాయి. ఈ లెక్కన కుటుంబ ఖర్చు రూ. పది వేలు దాటుతోంది.

 ఆనవాయితీ తప్పుతుందా?
 దసరా పండుగకు పిండివంటలు చేసుకుని బంధు,మిత్రులను పిలిచి భోజనాలు పెట్ట డం తెలంగాణలో అనవాయితీ. పప్పుల ధర లు కిలో రూ. 90 నుంచి రూ. 100కుచేరుకున్నాయి. పల్లి నూనె ధర రూ. 100 నుంచి రూ. 120కి చేరుకుంది. కిలో చికెన్ రూ.140, కిలో మటన్ రూ. 400 నుంచి రూ.450కి చేరుకుంది. కొత్త దుస్తులు, పిండివంటలు, మాం సాహారంతో పండుగ గడవాలంటే రూ. పది వేల నుంచి రూ. 15 వేలు వరకు ఖర్చు తప్పదని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.

 చేతికందని పంటలు
 ఖరీఫ్ సీజన్‌లో ఈ ఏడు వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు ఆలస్యంగా నాట్లు వేశారు. విత్తనాలు, ఎరువుల ధరలు పెరడగంతో సాగు కోసం రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. జిల్లాలో ఈ సారి సోయా, మొక్కజొన్న సాగు శాతం పెరుగగా, వరి సాగు శాతం తగ్గింది. వరి ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. సోయా, మొక్క జొన్న పంటలు చేతికందే సమయంలో వర్షాలు లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

 ఈ సమయంలో దసరా పండుగ ఖర్చులు రైతులకు భారంగా మారాయి. కరెంట్ కోతలు ఎక్కువ కావడంతో మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలలో చిరు వ్యాపారాలు చతికిల పడ్డాయి. వెల్డింగ్ షాపులు, జిరాక్స్ సెంటర్లు, ఫొటో స్టూడియోలు, పిండి గిర్నీలు, రైస్‌మిల్లులు, కార్పెంటర్లు కరెంట్ కోసం పడిగాపులు గాయాల్సి వస్తోంది. సరైన గిరాకీ లేక రోజుకు రూ. 500 వర కు సంపాదించుకునే చిరువ్యాపారులు కనీసం రూ. వంద కూడా కళ్ల చూడలేకపోతున్నారు. దీంతో దసరా ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.

Advertisement
Advertisement