అభ్యర్థుల్లో ఉత్కంఠ | nominations start to local body elections | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల్లో ఉత్కంఠ

Mar 18 2014 12:25 AM | Updated on Sep 2 2017 4:49 AM

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా ఆయా పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు.

కౌడిపల్లి, న్యూన్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా ఆయా పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు టికెట్ వస్తుందా లేదోననే ఉత్కంఠకు గురవుతున్నారు. మండలంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, బీజేపీ, టీడీపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. నామినేషన్ల పర్వం ప్రారంభమైనా ఆయా పార్టీల నాయకులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అ భ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా రిజర్వేషన్లు కలిసిరాక కొందరు వెనక్కి తగ్గగా అనుకూలించిన వారు పోటీ చేయాలని భావిస్తున్నా సొంత పార్టీలోనే పోటీ తీవ్రంగా ఉండడంతో బీ-ఫారం వస్తుం దా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు.

 మండల పరిషత్ అధ్యక్ష పదవి బీసీ మహిళకు, జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. మండలంలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 15 కాగా ఇందులో ఎనిమిది మహిళలకు, ఏడు స్థానాలు పురుషులకు రిజర్వు అయ్యాయి.

 కొనసాగుతున్న కసరత్తు..
 కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి సునీతారెడ్డి, టీఆర్‌ఎస్ తరఫున జిల్లా నాయకుడు మధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయా పార్టీల మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆశావహులు అధికంగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. ఒక్కో స్థానానికి ఒకే పార్టీ నుంచి ముగ్గురు, నలుగురు పోటీపడుతుండడంతో ప్రధాన పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

 జెడ్పీటీసీ టికెట్ కోసం..
 జెడ్పీటీసీ స్థానానికి అభ్యర్థి ఎంపిక కూడా ప్రధాన పార్టీలకు సమస్యగా మారింది. సీనియర్ నాయకులు, కొత్తగా వచ్చిన వారు, పార్టీకి దూరంగా ఉన్నవారు సైతం టికెట్లను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు సంగాగౌడ్, ఎంపీపీ మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షులు గండి యాదాగౌడ్, విశ్వంబరస్వామి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్‌లు తమ కుటుంబ సభ్యులకే కేటాయించాలని కోరుతున్నారు. టీఆర్‌ఎస్ తరఫున మండల పార్టీ అధ్యక్షుడు సారా రామాగౌడ్, మహిళ నాయకురాలు అనిత ఓంప్రకాశ్, కౌడిపల్లి మాజీ సర్పంచ్ మంజుల శివాంజనేయులు ఆశిస్తున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు రాజేందర్ తన కుటుంబ సభ్యులను పోటీలో దింపాలని చూస్తున్నా. అయితే ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులు ఎవరైనా వస్తే వారికి అవకాశం కల్పించాలని కూడా భావిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement