-
టీడీపీలో హాహాకారాలు
సాక్షి, అమరావతి/ఏలూరు (ఆర్ఆర్పేట)/ఆత్మకూరు రూరల్/అమలాపురం టౌన్/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశం పార్టీలో ఆగ్రహ జ్వాలలు చల్లారడంలేదు. పొత్తులు, సమీకరణలు, ధన ప్రభావంతో సీట్లు గల్లంతైన సీనియర్ నేతలు చంద్రబాబు తీరుపై గతంలో ఎన్నడూ లేనివిధంగా దుమ్మెత్తిపోస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తుతున్నారు. ప్రతిజిల్లాలోనూ అసమ్మతి తీవ్రస్థాయిలో రాజుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. 30కిపైగా నియోజకవర్గాల్లో సీట్లు రాని నేతలు టీడీపీ అభ్యర్థులను ఓడిస్తామని ప్రకటించడంతో బాబు తల పట్టుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఏలూరు ఎంపీ సీటును యనమల రామకృష్ణుడి అల్లుడు మహేశ్ కు కేటాయించడాన్ని తప్పు బట్టారు. చాలాఏళ్లుగా తమ సామాజికవర్గానికి కేటాయించే సీటును బీసీకివ్వడం సరికాదని, ఈ సీటును బీసీలకు ఇవ్వాలని ఎవరడిగారని ఆయన మంగళవారం రాత్రి చంద్రబాబును కలిసినప్పుడు ప్రశ్నించారు. తమకు కనీసం చెప్పకుండా తమ సీటును మార్చడం అవమానించడమేనని నిలదీశారు. బీసీల్లో యనమల కుటుంబం తప్ప మరొకరు దొరకలేదా? ఎక్కడో కడప నుంచి అభ్యర్థిని తీసుకురావడమేమిటీ అంటూ మాగంటి సంధించిన వరుస ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదని సమాచారం. చంద్రబాబు ఎంత బుజ్జగించినా, ఎన్నికల తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని నమ్మబలికినా మాగంటి శాంతించలేదు. ఆయన తన దారి తాను చూసుకోవడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. చంద్రబాబును కలిసి బయటకు వచ్చిన వెంటనే బాబుపై నమ్మకం లేదని వ్యాఖ్యానించి కోపంగా వెళ్లిపోవడం దీనికి బలం చేకూరుస్తోంది. చంద్రబాబుతో చర్చలు ఆశాజనకంగా సాగలేదని పార్టీ శ్రేణులకు మాగంటి బాబు రాసినట్టు చెబుతున్న ఓ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ♦ కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్ నియోజకవర్గాల్లో టికెట్లు దక్కని టీడీపీ ఇన్చార్జులు అసమ్మతిబావుటా ఎగురేశారు. ఆదోనిలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మీనాక్షినాయుడు సీటును బీజేపీకి కేటాయించడంపై మండిపడుతున్నారు. తానుగానీ, తన తనయుడుగానీ ఇండిపెండెంట్గా బరిలో దిగాలని యోచిస్తున్నారు. ఆలూరులో టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. కుటుంబానికి ఒకే సీటు అంటూ తనను పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర, నందికొట్కూరులో గిత్త జయసూర్యకు టికెట్లు కేటాయించిన తర్వాత గెలుపు అవకాశాలు సన్నగిల్లాయని నివేదికలు అందడంతో ఈ సీట్లను మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. కోడుమూరులో ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి వర్గాల మధ్య టిక్కెట్ పంచాయతీ తెగలేదు. విష్ణు ప్రతిపాదించిన బొగ్గుల దస్తగిరి అభ్యర్థిత్వాన్ని కోట్ల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆకేపోగు ప్రభాకర్కు టిక్కెట్ ఇవాల్సిందేనని పట్టుబట్టినా అధిష్టానం స్పందించకపోవడంతో ప్రచారంలో పాలుపంచుకోవడం లేదు. డోన్ ఇన్చార్జ్ మన్నే సుబ్బారెడ్డిని కాదని కోట్ల సూర్యప్రకాశ్రెడ్డికి టికెట్ ఇవ్వడంతో సుబ్బారెడ్డి సైలెంట్ అయ్యారు. ప్రచారంలో మాత్రం పాల్గొనడం లేదు. నంద్యాలలో భూమా బ్రహా్మనందరెడ్డి కూడా అభ్యర్థి ఫరూక్కు సహకరించడం లేదు. ♦ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పదేళ్లుగా పని చేస్తున్న కిమిడి నాగార్జునను కనీసం పరిగణన లోకి తీసుకోకుండా ఆ సీటును ఆయన బంధువు కళా వెంకట్రావుకు కేటాయించడంపై పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తున్న తనను బాబు తన అవసరం కోసం రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇప్పుడు కనీసం మాటమాత్రంగానైనా చెప్పకుండా పక్కకు తప్పించడంపై నాగార్జున కన్నీటి పర్యంతమయ్యారు. ♦ పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడం, అక్కడ తన వ్యతిరేకి పంచకర్ల రమే‹Ùను ఆ పార్టీ నుంచి పోటీ చేయిస్తుండడాన్ని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి జీర్ణించుకోలేకపోతున్నారు.చంద్రబాబు తనను ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. కొన్నిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన ఇక రాజకీయాల నుంచి విరమిస్తానని నిర్వేదం వ్యక్తం చేయడంపై పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. ♦ అనపర్తి సీటును తొలిజాబితాలోనే తనకు కేటాయించి.. అంతలోనే మళ్లీ బీజేపీకి ఇవ్వడంపై మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ♦ రాజంపేట సీటును పార్టీ శ్రేణులకూ తెలియని సుగవాసి సుబ్రహ్మణ్యంకి కేటాయించడంతో బత్యాల చెంగల్రాయుడు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ♦హజ్ కమిటీ రాష్ట్ర మాజీ చైర్మన్ మోమిన్ అహమ్మద్ హుసేన్ బుధవారం తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్లు ఆయన కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 30 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన హుసేన్ పలు కీలక పదవులలో సేవలందించారు. ఆయనతో పాటు టీడీపీ రాయలసీమ స్థాయి నాయకుడైన కుమారుడు మోమిన్ ముస్తఫా, స్థానిక మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ అయిన మరో కుమారుడు ముఫ్తి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ♦ టీడీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో బుధవారం నిర్వహించిన ప్రచారంలో పార్టీలోని వర్గవిభేదాలు బయటపడ్డాయి. ప్రచార రథమెక్కేందుకు యత్నించిన వవ్వేరు బ్యాంక్ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డిని పోలంరెడ్డి దినేష్రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆయన అనుచరులనూ మెడపట్టి తోసేశారు. మరొకరిని కాలితో తన్నడంతో కిందపడిపోయారు. దీంతో సూరాతోపాటు ఆయన అనుచరులు అవమానభారంతో వెనుదిరిగారు. సూరా ఇటీవలే టీడీపీలో చేరారు. ఆయన చేరికను పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. ప్రశాంతిరెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూరాకు హుకుం జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రశాంతిరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. దీంతో ఆమె అర్ధాంతరంగా ప్రచారాన్ని ఆపేసి వెనుదిరిగారు. ళీ అనంతపురం అర్బన్ సీటును దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అనే కొత్త వ్యక్తికి ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి వర్గం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా అధ్యక్షుడికి ఫ్యాక్స్, వాట్సాప్ల ద్వారా బుధవారం పంపించారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడినా తనకు న్యాయం జరగలేదని, జనసేనకు పట్టు ఉన్న అమలాపురాన్ని టీడీపీ చేతిలో పెట్టడమేమిటని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వివరించారు. -
వచ్చే వారంలో కాంగ్రెస్ కీలక భేటీలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలకు పదునుపెట్టి, వాటిని అమలు పరిచే చర్యల్లో భాగంగా వచ్చే వారం రోజుల్లో కాంగ్రెస్ కీలక భేటీలు నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా పారీ్టకి తన లక్ష్యాలను వివరించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ, ప్రచారాస్త్రాల ఖరారుకు మేనిఫెస్టో కమిటీలు వారం రోజుల్లో భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సీడబ్ల్యూసీ సమావేశంలో అభ్యర్థుల జాబితా, ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి పక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలపై నేతలకు వివరించే అవకాశాలున్నాయి. రానున్న వారం రోజుల్లో కనీసం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
ఎంపీగానా.. వద్దుబాబోయ్! అనంతపురం టీడీపీలో అభ్యర్థుల వెనకడుగు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాము చెప్పిందే వేదం... చేసిందే చట్టం... అన్నరీతిలో సాగుతోంది టీడీపీలో అభ్యర్థుల ఎంపిక విధానం. తండ్రీకొడుకులు వేర్వేరు జాబితాలు సిద్ధం చేసుకోవడంతో వారి మధ్య సయోధ్య నడవక... మరోవైపు ఎక్కడ జాబితా ప్రకటించేస్తే అసమ్మతి నేతలు బయటకు వెళ్లిపోతారోనన్న భయంతో ఎక్కడా అభ్యర్థులను ఖరారు చేయకుండా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా తయారవుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షులకే తాము కోరుకున్న చోట టికెట్ దొరికే అవకాశం లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఎంపీగానే వెళ్లాలని అధిష్టానం హుకుం అనంతపురం జిల్లాకు కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లాకు బి.కె.పార్థసారథి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికీ అసెంబ్లీ టికెట్లు లేవని పరోక్షంగా పార్టీ అధిష్టానం సంకేతాలిచ్చింది. ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశం లేనందున ఎంపీలుగా పోటీ చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇద్దరూ ససేమిరా అంటున్నారు. రెండు రోజుల క్రితం కాలవ శ్రీనివాసులు తాను రాయదుర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీగానే వెళ్లాలని నారా లోకేశ్ తన సన్నిహితుల వద్ద తెగేసి చెప్పినట్టు తెలిసింది. బీకే పార్థసారథి కూడా ఎంపీగా వెళ్లడానికి సుముఖంగా లేరు. మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడు పెనుకొండ టికెట్ ఇవ్వకుండా ఎంపీగా వెళ్లమనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఉరవకొండకు చంద్రబాబు వచ్చినప్పుడు కూడా టికెట్ గురించి ప్రస్తావించగా.. ఆయన దాటవేసినట్టు తెలుస్తోంది. టికెట్లు ప్రకటించేస్తే వెళ్లిపోతారేమో.. ఇప్పటికిప్పుడు టికెట్లు ఖరారు చేసేస్తే అసమ్మతి నేతలంతా పార్టీని వదిలి వెళ్లిపోతారేమోననే ఆందోళనతోనే అధినేత చంద్రబాబు సాగదీత ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు దాదాపు ఖరారై... ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా ఇప్పటికీ టీడీపీలో అభ్యర్థులెవరో తేలకపోవడం విశేషం. తాడిపత్రి, హిందూపురం, ఉరవకొండ మినహా.. మిగతా 11 సెగ్మెంట్లలోనూ అభ్యర్థి ఎవరన్నది తెలియని పరిస్థితి నెలకొంది. అనంతపురం అర్బన్ టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వొచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల వ్యయం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులకు చంద్రబాబు, లోకేశ్లు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. -
అత్యధిక స్థానాలపై కమలం గురి
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా దక్షిణాదిలో పట్టు సాధించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది ఈ మేరకు హస్తిన వేదికగా రాష్ట్ర నాయకత్వంతో సమాలోచనలు జరుపుతోంది. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన వారు, ప్రజాదరణ ఉన్న నేతలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, సీనియర్ నేత ఈటల రాజేందర్లు బుధవారం ఢిల్లీలో జాతీయ నాయకత్వంతో భేటీ అయ్యారు. మరోవైపు కిషన్రెడ్డి పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశమై దాదాపు 40 నిమిషాలు చర్చించారు. కాగా ఆయా సమావేశాల్లో 17 లోక్సభ స్థానాల్లో పార్టీ బలాబలాలు, తాజా రాజకీయ పరిస్థితి, బలమైన నేతలు, ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్టు సమాచారం. నడ్డా దిశా నిర్దేశం మంగళవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలోనూ లోక్సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన ప్రణాళికలపై అధ్యక్షుడు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీ బలంగా ఉన్నందున, దక్షిణాదిలోనూ ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ లోక్సభ స్థానాలు గెలిచేందుకు సిద్ధం చేసిన రోడ్మ్యాప్పై చర్చించారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రుల ప్రచార సభలు, రోడ్ షోలు తదితర ప్రచార కార్యక్రమాల షెడ్యూల్పై పార్టీ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్ కుమార్లు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్సభ ఎ న్నికలపై ఏ విధంగా పడుతుందన్న అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు కేవ లం సీనియర్లు అనే కాకుండా యువత, మహిళలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను సైతం సీట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకోవాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. -
నేడే కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఇంకా ప్రకటించని 19 స్థానాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కట్టబెట్టిన నేపథ్యంలో ఆయన దీనిపై దృష్టి సారించారు. ఆదివారం తెలంగాణ పర్యటన సందర్భంగానే ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న ఖర్గే సోమవారం కూడా కొందరు నేతలతో చర్చించారు. పటాన్చెరు, నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలకు సంబంధించి సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహతో మాట్లాడిన ఖర్గే, కమ్యూనిస్టులతో పొత్తులు, వారికి సంబంధించిన సీట్లపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో చర్చించారు. నల్లగొండ జిల్లాకు సంబంధించిన స్థానాలపై ఉత్తమ్కుమార్రెడ్డి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టులకు ఇచ్చే ఆ నాలుగు మినహా కమ్యూనిస్టులకు ఇవ్వాలని భావిస్తున్న నాలుగు నియోజకవర్గాలు మినహా, మిగతా 15 స్థానాలకు అభ్యర్థులను సోమవారం సాయంత్రానికే ఫైనల్ చేస్తారని భావించారు. అయితే రాజస్తాన్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తులో అధిష్టాన పెద్దలు బిజీగా ఉండటంతో ఆ ప్రక్రియను మంగళవారం పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చి నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రికి లేదా బుధవారం ఉదయానికి జాబితా ప్రకటించే అవకాశం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలంతా ఢిల్లీలోనే తిష్టవేసి అధిష్టాన పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
Advertisement