సచివాలయంలో నిఘా నిద్రపోతోంది.. | No Proper Protection in Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో నిఘా నిద్రపోతోంది..

Apr 1 2018 1:43 AM | Updated on Sep 4 2018 5:44 PM

No Proper Protection in Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: నిత్యం ప్రజాప్రతినిధులు, పాలనాధికారులు, సందర్శకులతో రద్దీగా ఉండే రాష్ట్ర సచివాలయానికి కనీస భద్రత కరువైంది. నగరం నడిబొడ్డున ఉన్న సచివాలయానికి వెళ్లే దారులు నిరంతర నిఘాలో.. నిత్య పర్యవేక్షణలో ఉంటే, సచివాలయంలోకి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద మాత్రం నిఘా నిద్రపోతోంది. వచ్చీపోయే వాహనాలు, సందర్శకుల కదలికలపై కన్నేసే సీసీ కెమెరాలు కళ్లు మూసుకుని నిద్రపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ముఖ్యంగా లుంబినీ పార్క్‌ ఎదురుగా, ట్యాంక్‌బండ్‌ రహదారిపై సచివాలయంలోకి వెళ్లే గేటు వద్ద రక్షణ పూర్తిగా పడకేయడం ఆందోళన రేపుతోంది. రాష్ట్ర సచివాలయంలోకి వెళ్లేందుకు 2 గేట్లు ఉన్నాయి.

ఒకటి తెలంగాణ మెయిన్‌ గేటు కాగా.. రెండోది ఏపీ మెయిన్‌ గేటు. తెలంగాణ గేటు నుంచి సీఎంతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు వస్తుంటారు. ఏపీ, తెలంగాణ గేటు నుంచి ప్రజలు, సందర్శకులు పలు పనుల మీద వచ్చి వెళ్తుంటారు. ఏపీ ప్రధాన ద్వారం దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కొన్ని ఆకాశం వైపు చూస్తుంటే, మరికొన్ని పాడైపోయాయి. అలాగే పనిచేయని స్కానింగ్‌ మిషన్‌ను పూర్తిగా పక్కన పడేశారు. ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి తరలిపోయినా బిల్డింగ్‌ను రాష్ట్రానికి అప్పగించలేదు. దీంతో వాటిని పట్టించుకునే వారే లేకుండా పోయారని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చేసే పనులతో ఇబ్బంది పడాల్సి వస్తోందని ప్రజాప్రతినిధులు, సందర్శకులు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement