21 ఏళ్ల తర్వాత..!

MPDO promotions get CM KCR - Sakshi

నల్లగొండ : ఎంపీడీఓలకు శుభవార్త.. పదోన్నతుల కోసం ఎప్పుడెప్పుడా అని సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వారికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీపికబురు అందించారు. ఎంపీడీఓల పదోన్నతుల ఫైల్‌పై సోమవారం సీఎం సంతకం చేశారు. దీంతో 21 ఏళ్ల నిరీక్షణకు తెరదించినట్టయింది. ఎంతోకాలం నుంచి ప్రమోషన్‌లు రాక ఎంపీడీఓలు అదే కేడర్‌లోనే రిటైర్డ్‌ అయి న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ విషయమై ఎంపీడీఓలు సీఎంను కలిసి విన్నవించుకోవడంతో ఎట్టకేలకు తుది నిర్ణయం తీసుకుని పదోన్నతుల ఫైల్‌పై సంతకం చేశారు. ఎంపీడీఓలతో పాటు కింది స్థాయి కేడర్‌కు కూడా పదోన్నతులు వస్తుండడంతో వారిలో ఆనందం నెలకొంది.

ఎట్టకేలకు..
ఎంపీడీఓలు 21 సంవత్సరాలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరి సమస్యను ఎవ రూ కూడా పట్టించుకోలేదు. అప్పుడు టీడీపీ, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రమోషన్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే ఎంపీడీఓలు ఏళ్ల తరబడి అదే పోస్టులో పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. ఎంపీడీఓలకు ప్రమోషన్‌లు రా కపోవడంతో ఆ శాఖలోని కిందిస్థాయి  ఉద్యోగులకు కూడా పదోన్నతులు రాలేదు. వేతనం పెరిగి నా పదోన్నతులు రాకపోవడంతో భారీ ఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 54 మంది ఎంపీడీఓలు ఉన్నారు. వీరిలో సుమారుగా 20మందికి పైగా ఎంపీడీఓలు పదోన్నతులు పొందనున్నారు. డీఆర్‌డీఓ, జెడ్పీసీఈఓ, డిప్యూటీ సీఓ, అడిషనల్‌ డీఆర్‌డీఓలుగా వారి సీనియారిటీ బట్టి పదోన్నతులు లభిస్తాయి.
 
కిందిస్థాయి ఉద్యోగులకూ పదోన్నతులు
ఎంపీడీఓలకు పదోన్నతులు లభిస్తుండడంతో వా రి పోస్టుల్లోకి పదోన్నతులపై ఈఓపీఆర్డీ, జిల్లా పరిషత్‌ సూపరింటెండెంట్‌లు పదోన్నతులు పొం దుతారు. కాగా ఖాళీ అయిన వీరి స్థానాల్లోకి సీని యర్‌ అసిస్టెంట్‌లు, వారి స్థానాల్లోకి జూనియర్‌ అసిస్టెంట్‌లు వీరి స్థానాల్లోకి రికార్డ్‌ అసిస్టెంట్‌లు, అటెండర్‌లు, వాచ్‌మెన్‌లు అర్హతను బటి పదోన్నతులు పొందుతున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ కేటగిరుల్లో 150 మంది వరకు పదోన్నతులు పొందే అవకాశం ఉంది.

కోర్టు కేసుల ఉపసంహరణతో..
ఎంపీడీఓల పదోన్నతుల విషయంలో కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండడంతో 21 ఏళ్లుగా ప దోన్నతులకు అవకాశం కలగలేదు. అయితే ఎంపీడీఓ కేడర్‌లో ఉమన్‌ వెల్ఫేర్, ఈఓఆర్డీ డైరెక్ట్‌ రిక్యూర్‌మెంట్‌ ద్వారా వచ్చిన వారు ఉన్నారు. ఈ మూ డు కేటగిరీల వారు ప్రమోషన్ల విషయంలో తమకే ముందు పదోన్నతులలో అవకాశాలు కల్పించా లంటే, తమకే ముందు కల్పించాలని పోటీపడి కోర్టుకు ఎక్కారు. ఈ విషయాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు కేటగిరీల వారిని పిలిపించి చర్చలు జరిపారు. ఒక్కొక్క కేడర్‌ నుంచి వచ్చిన వారికి 1ః1 పద్ధతిలో పదోన్నతులు కల్పిస్తానని చెప్పడంతో వారు సమ్మతించారు. కోర్టులో కేసులను ఉçపసంహరించుకుంటే పదోన్నతి కల్పిస్తానని చెప్పడంతో ఉద్యోగులు కేసులు ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదోన్నతుల ఫైల్‌పై సోమవారం సంతకం చేశారు. దీంతో 21 ఏళ్ల పాటు ఎంపీడీఓల పదోన్నతుల నిరీక్షణకు తెర పడినట్లయింది.

సీఎంకు కృతజ్ఞతలు
21ఏళ్ల పాటు పదోన్నతులు లేక ఎంతో ఆందోళన చెందాం. పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ పొందుతామనే బాధ కలిగేది. ఎట్టకేలకు ముఖ్య మంత్రి కేసీఆర్‌ స్పందించి పదోన్నతులు కల్పించినందుకు ఎంపీడీఓల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
 – గోనె మోహన్‌రావు, గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top