
‘మెట్రో’ కూత కూసేదెన్నడో!
పటాన్చెరు వరకు మెట్రో రైలు పొడిగిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడంతో స్థానికులు మెట్రో రాకకోసం వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నారు.
రైలు కోసం రామచంద్రాపురం ప్రజల ఎదురుచూపు
రామచంద్రాపురం: పటాన్చెరు వరకు మెట్రో రైలు పొడిగిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడంతో స్థానికులు మెట్రో రాకకోసం వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నారు. రామచంద్రాపురం, పటాన్చెరు పారిశ్రామిక వాడనుంచి నిత్యం సుమారు లక్షమంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు బస్సుల్లో, వాహనాల్లో నగరానికి వెళ్లి వస్తున్నారు. అయితే ప్రయాణికులు నగరానికి వెళ్లేందుకు సుమారు గంటకు పైగా సమయం పడుతోంది. ఒక్కోసారి గంటలోగా చేరుకోవాల్సిన గమ్యం ట్రాఫిక్ కారణంగా మూడు నాలుగు గంటలు పడుతోంది. దీంతో వాహనదారులు నిత్యం ట్రాఫిక్తో సతమతమవుతున్నారు. మరి కొంత మంది ట్రాఫిక్లో ప్రయాణం చేయలేక లింగంపల్లి రైల్వే స్టేషన్లో వాహనాలు నిలిపి ఎంఎంటీఎస్లో నగరానికి వెళ్లివస్తున్నారు.
గత ఏడాది రామచంద్రాపురం వరకు ఎంఎంటీఎస్ను పొడిగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పట్టణ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పనులు కూడా జరుగుతుండటంతో త్వరలో ఎంఎంటీఎస్ కల నెరవేరనుంది. దీనికి తోడు కొంతమంది ప్రజాప్రతినిధులు మెట్రో రైలును రామచంద్రాపురం, పటాన్చెరు వరకు తెస్తామని హామీ ఇవ్వడంతో పట్టణ వాసులు తమ కష్టాలు తీరినట్టేనని ఆనందపడుతున్నారు. మెట్రో వస్తే బస్సుల్లో నిలబడి ప్రయాణించే బాధ తప్పుతుందంటున్నారు.