లొంగు‘బాట’లో..  

Maoist Surrenders In Adilabad - Sakshi

నిర్మల్‌: చుట్టూ అడవులు, గుట్టలు, వాగులు, వంకలతో పాటు గోదావరి నది సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఒకప్పుడు నక్సల్స్‌కు ఖిల్లాగా ఉండేది. విప్లవ సాహిత్యం, ఉద్యమ పాటలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన అన్నలు ఉమ్మడిజిల్లాలోని నిర్మల్‌ ప్రాంతంపైనా పట్టు సాధించారు. విద్యావంతులైన యువతను దళంలో చేరేలా ప్రోత్సహించారు. అలా 35ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లి.. మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎదిగిన ఆయనే సట్వాజీ అలియాస్‌ సుధాకర్‌.

ఇలా నిర్మల్‌ ప్రాంతం నుంచి పలువురు నక్సల్స్‌ ఉద్యమానికి ఆకర్షితులై తుపాకీ చేతబట్టారు. కాలక్రమంలో వివిధ ఎన్‌కౌంటర్లలో కొంతమంది హతం కాగా, మరికొందరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. రెండుమూడేళ్లుగా  ఒక్కొక్కరుగా వనం వీడుతూ జనజీవనంలోకి వస్తున్నారు. తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నాయకుడు సట్వాజీ జార్ఖండ్‌లో పోలీసులకు లొంగిపోవడం సంచలనంగా మారింది. ఇప్పటికే కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలినట్టైంది.

జిల్లాలో కనుమరుగు.. 
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్‌ ప్రాంతంలోనూ నక్సల్స్‌ తమ ఆధిపత్యాన్ని చెలాయించిన సందర్భాలు ఉన్నాయి. నర్సాపూర్, పెంబి తదితర పోలీసుస్టేషన్‌లతో పాటు పోలీసుల వాహనాలను పేల్చివేసిన హింసాత్మక ఘటనలు ఉన్నా యి. నిర్మల్‌లో పట్టపగలే డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న రమేశ్‌రెడ్డిని హతమార్చి సంచలనం సృష్టించారు. కానీ..కాలక్రమంలో పోలీసులు పట్టు సాధించడంతో జిల్లాలో దళం తుడిచిపెట్టుకు పోయింది. రెండేళ్ల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటుతో పోలీసులకు మరింత పట్టు దొరికింది. గ్రేహౌండ్స్‌లో అసాల్ట్‌ కమాండర్‌గా పనిచేసిన అనుభవం కలిగిన ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ వచ్చిరాగానే దళ సభ్యుడు కంతి రవిని, ఏడాది అనంతరం పెంద్రం పద్మను సరెండరయ్యేలా చేశారు. ఆ తర్వాత వచ్చిన శశిధర్‌రాజు సైతం నేరుగా సట్వాజీ తల్లి దేవుబాయి వద్దకు వెళ్లి పలకరించడం, ఆమె ద్వారా కొడుకు లొంగిపోవాలని విన్నవించేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. ఓ వైపు పోలీసుల విధానం మారడం, మరోవైపు రిక్రూట్‌మెంట్లు లేకపోవడంతో జిల్లాలో మావోయిస్టుల ఉనికి లేకుండా పోయింది.

జిల్లా ఏర్పడిన కొత్తలోనే కంతి రవి.. 
జిల్లాకు చెందిన మంగి దళ సభ్యుడు కంతి రవి అలియాస్‌ సురేష్‌ 2016 అక్టోబర్‌ 15న అప్పటి ఎస్పీ విష్ణు వారియర్‌  సమక్షంలో లొంగిపోయాడు. జిల్లా ఏర్పడిన కొత్తలోనే రవి సరెండర్‌ కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కడెం మండలం లక్ష్మీసాగర్‌ గ్రామానికి చెందిన కంతి రవి అలియాస్‌ సురేష్‌ సొంత అక్క కంతి లింగవ్వ అలియాస్‌ అనిత 20 ఏళ్ల క్రితం దళంలో చేరింది. ఆమె మావోయిస్టు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా ఉన్న మైలారపు అడెల్లును వివాహం చేసుకున్నారు. తన సోదరి ద్వారా తరచుగా దళంతో పరిచయమైన కంతిరవి 2014లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు కార్యదర్శిగా ఉన్న మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌కు గన్‌మెన్‌గా పనిచేశాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని తూర్పు ప్రాంతం, చత్తీస్‌గఢ్‌లలో ఇన్‌ఫార్మర్‌ల హత్య, వాహనాల దగ్ధం ఘటనల్లో పాల్గొన్నాడు. పలుమార్లు ఎన్‌కౌంటర్‌ల నుంచి తృటిలో తప్పించుకున్న కంతి రవి 2016లో అప్పటి ఎస్పీ వారియర్‌ వద్ద లొంగిపోయాడు. తల్లితో పాటు తన అనారోగ్య కారణాల వల్ల లొంగిపోయినట్లు అప్పట్లో ప్రకటించాడు.

2017లో పెంద్రం పద్మ.. 
మామడ మండలం కిషన్‌రావుపేట్‌ పంచాయతీ పరిధిలోని మొర్రిగూడకు చెందిన పెంద్రం పద్మ అలియాస్‌ సావిత్రి మూడో తరగతి వరకు చదువుకుని మధ్యలోనే ఆపేసింది. పొచ్చెర గ్రామంలో కూలీ పని చేస్తుండగా ఆమెకు మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయని పోలీసులు తెలిపారు. 2014 నుంచి ఆమె మహారాష్ట్రలోని సిరోంచ దళ సభ్యురాలిగా పనిచేసింది. 2017 డిసెంబర్‌ 25న పద్మ అప్పటి ఇన్‌చార్జి ఎస్పీ వారియర్‌ సమక్షంలో లొంగిపోయింది.

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను జనజీవనంలోకి తీసుకురావడానికి జిల్లా పోలీసులు పలు కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో వ్యూహాత్మకంగా దళ సభ్యుల కుటుంబాలకు చేరువ కావడం చాలా ప్రభావం చూపింది. ఏ కష్టమొచ్చినా తాము అండగా నిలుస్తామని పోలీసులు వారికి భరోసానివ్వడం, ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించడం, దుస్తులను పంపిణీ చేయడంతో పాటు దళ సభ్యుల కుటుంబాలతో కలిసి సహపంక్తి భోజనాలూ చేశారు. పోలీసులకు లొంగిపోతే ప్రశాంతంగా తమతో కలిసి ఉండవచ్చనే సమాచారాన్ని కుటుంబాల ద్వారా సభ్యులకు చేరేలే చేశారు. దీని ఫలితంగానే జిల్లాలో గతంలో 14నెలల వ్యవధిలో ఇద్దరు దళ సభ్యులు జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు.

ఇప్పుడు సట్వాజీ.. 
పీపుల్స్‌వార్‌(మావోయిస్టు)లో జిల్లా నుంచి కేంద్ర కమిటీ దాకా ఎదిగిన మావోయిస్టు నాయకుడు ఒగ్గు సట్వాజీ అలియాస్‌ సుధాకర్‌(బురియార్‌/కిరణ్‌). సారంగపూర్‌ మండలకేంద్రానికి చెందిన ఆయన ఇంటర్‌ చదువుతుండగానే రాడికల్స్‌ స్డూడెంట్‌ యూనియన్‌(ఆర్‌ఎస్‌యూ) ద్వారా నక్సల్స్‌ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. అలా 1984లో టీనేజీలోనే పూర్తిస్థాయిలో పీపుల్స్‌వార్‌ దళసభ్యుడిగా చేరారు. అనతికాలంలో తన తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని దాదాపు అన్ని దళాలకు నాయకత్వం వహించారు.

జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కమాండర్‌(కార్యదర్శి)గా, ఉత్తర తెలంగాణ జోనల్‌ కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, దండకారణ్యంలో మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జిగా వివిధ బాధ్యతలు చేపట్టారు. 2013 నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉంటూనే సెంట్రల్‌ మిలటరీ సభ్యుడిగా, బీహార్‌–జార్ఖండ్‌ స్పెషల్‌ ఏరియా కమిటీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. నక్సలైట్‌గా మారిన రెండేళ్లకే 1986లో కర్ణాటకలోని గుల్బార్గాలో సట్వాజీ పోలీసులకు చిక్కారు.

1989 చివరి వరకు జైలులోనే ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేయడంతో బయటకు వచ్చారు. అప్పుడు ఇంటి వద్దే ఉంటూ నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌లో తిరుమల థియేటర్‌ ఎదురుగా కంకి కొడవలితో గల భారీ పీపుల్స్‌వార్‌ స్తూపం నిర్మింపజేశారు. సుధాకర్‌ జనంలోకి వచ్చి కీలకంగా మారుతున్న తరుణంలోనే ప్రభుత్వం మళ్లీ నిషేధం విధించడంతో 1991నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి జనంలోకి రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన అన్ని ప్రధాన హింసాత్మక ఘటనల్లో ఆయన పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతుంటారు.

ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడి నిర్వహణలోనూ ఈయన పాత్ర ఉన్నట్లు సమాచారం. 2017 ఆగస్టులో తన తమ్ముడు నారాయణ పట్టుబడటం, కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరగడంతో సట్వాజీ లొంగిపోయినట్లు సమాచారం. తనతో పాటు ఆయన భార్య నీలిమ అలియాస్‌ మాధవి కూడా లొంగిపోయినట్లు చెబుతున్నా.. కొన్ని వర్గాలు మాత్రం ఆమె లొంగిపోలేదని పేర్కొంటున్నాయి. సట్వాజీపై రూ. కోటి, ఆయన భార్య నీలిమపైన రూ.25లక్షల రివార్డులు ఉన్నాయి. సట్వాజీ లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలనట్లు కావడంతో పాటు జిల్లా నుంచి ఉన్న ఏకైన నాయకుడిని కోల్పోయినట్లయింది.

మిగిలిన వారి కోసం.. 
జిల్లా నుంచి దళంలో ఉన్న అతి కొద్ది మంది కూడా ఇటీవల కాలంలో వరుసగా జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులతో పాటు ఉద్యమంలో ఏర్పడుతున్న మార్పులు వారిని ఇంటిబాట పట్టిస్తున్నాయి. కంతి రవి, పెంద్రం పద్మ, ఒగ్గు సట్వాజీ లొంగిపోగా, మరికొందరు దళంలోనే కొనసాగుతున్నారు. వారిలో సోన్‌ మండలంలోని కూచన్‌పెల్లికి చెందిన ఇర్రి మోహన్‌రెడ్డి అలియాస్‌ భాస్కర్‌/ఉమేశ్‌/మహేశ్‌/విజయ్, మామడ మం డలం బురదపల్లికి చెందిన పెంద్రం జైతూబాయి అలియాస్‌ గంగుబాయి/లతక్క, కడెం మండలం లక్ష్మీసాగర్‌కు చెందిన కంతి లింగవ్వ అలియాస్‌ అనిత, ఇదే మండలంలోని అల్లంపెల్లికి చెందిన గోసిబాయి, పెంబి మండలంలోని బాబాపూర్, రాజూరాకు చెందిన తూము శ్రీనివాస్‌ అలియాస్‌ శ్రీను ఇప్పటికీ ఆజ్ఞాతంలోనే ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. వారిని కూడా జనజీవనంలోకి రమ్మని చెబుతున్నామని, వారు కూడా త్వరలోనే వస్తారని ఆశిస్తున్నామని చెబుతున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top