ఎంటెక్ చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలోని ఓ లాడ్జిలో మంగళవారం వెలుగుచూసింది.
పటాన్చెరు టౌన్ (మెదక్) : ఎంటెక్ చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలోని ఓ లాడ్జిలో మంగళవారం వెలుగుచూసింది. పటాన్చెరు సీఐ లింగేశ్వర్, స్థానికుల కథనం ప్రకారం... ఎన్.ఉదయభాస్కర్(23) రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇతను తల్లిదండ్రులతో కలిసి ఇస్నాపూర్లో ఉంటున్నాడు.
కాగా ఉదయ భాస్కర్తోపాటు ఆరుగురు స్నేహితులు సోమవారం రాత్రి ముత్తంగి సమీపంలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. స్నేహితులంతా తెల్లారేసరికి లాడ్జి గది నుంచి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం లాడ్జి సిబ్బంది వెళ్లి చూడగా బెడ్పై ఉదయభాస్కర్ విగతజీవిగా పడి ఉన్నాడు. గదిలో విషం డబ్బా కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అతని జేబులో బంగారం తాకట్టు పెట్టిన రశీదు లభించింది. సోమవారం రాత్రి గదికి వచ్చిన వారందరినీ పోలీసులు విచారిస్తున్నారు.
అయితే వారిలో అనిల్కుమార్ అనే యువకుడు పరారీలో ఉన్నారు. ఉదయభాస్కర్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా విషప్రయోగం చేశారా? అన్న కారణాలు తెలియాల్సి ఉంది. ఇతను మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. లాడ్జిలోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి తండ్రి రామకృష్ణ్ణ వరప్రసాద్ చిట్కుల్లోని జీటీఎన్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు.