ప్రారంభమైన ఎల్బీనగర్‌-అమీర్‌పేట్‌ మెట్రోరైలు

LB nagar-Ameerpet Metro Rail inaugurated By Governor narasimhan - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఎల్బీనగర్‌-అమీర్‌పేట్‌ (16 కి.మీ.) మార్గంలో మెట్రో రైలు ప్రారంభమైంది. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్‌, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావు, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొని.. మెట్రోరైలులో ప్రయాణించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రయాణికులకు ఈ మార్గంలో మెట్రోరైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ రూట్లో మొత్తం 17 స్టేషన్లుండగా.. నాలుగు మినహా మిగతాచోట్ల ఇప్పటివరకు పార్కింగ్‌ వసతులు అందుబాటులో లేవు. ఈ మార్గం ప్రారంభంతో ఎల్బీనగర్‌ నుంచి బయలుదేరిన వ్యక్తి 29 కి.మీ. దూరంలో ఉన్న మియాపూర్‌కు 52 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రారంభంలో ప్రతి ఐదు నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైళ్లు 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి.

ఆ తరవాత రైళ్ల ఫ్రీక్వెన్సీ 2 నిమిషాలకు కుదిస్తామని అధికారులు తెలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లో మెట్రో ప్రారంభంతో ఎంజీబీఎస్, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ డిపో, మలక్‌పేట్, నాంపల్లి రైల్వేస్టేషన్లకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు ట్రాఫిక్‌ నరకం నుంచి ఉపశమనం కలగనుంది. ఈ రూట్లో అసెంబ్లీ–ఎంజీబీఎస్‌ మార్గంలో పలు చారిత్రక కట్టడాలున్న నేపథ్యంలో ఐదు కిలోమీటర్ల మార్గంలో దక్కనీ, ఇండో పర్షియన్‌ కళాత్మకత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. తొలిరోజు సుమారు 50 వేలు.. తర్వాత నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top