అన్ని మతాల పేదలకు చేయూత: కేటీఆర్‌ | KTR distribution Ramadan kits to muslims | Sakshi
Sakshi News home page

అన్ని మతాల పేదలకు చేయూత: కేటీఆర్‌

May 30 2019 2:07 AM | Updated on May 30 2019 2:07 AM

KTR distribution Ramadan kits to muslims - Sakshi

సిరిసిల్లలో ఇఫ్తార్‌ విందులో కేటీఆర్‌

సిరిసిల్ల: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండలంలో బుధవారం సాయంత్రం ముస్లింలకు రంజాన్‌ కానుకలను కేటీఆర్‌ పంపిణీ చేశారు. అనంతరం జరిగిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 700 గురుకులాలలో లక్షలాది మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్షకు పైగా వెచ్చిస్తోందని తెలిపారు. నాణ్యమైన విద్యతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దని, పేదరికం శాశ్వతంగా తొలగిపోతుందని చెప్పారు.

గురుకులాల్లో ముస్లిం పిల్లలు ఎక్కువగా చదువుకుంటున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. సర్వమతాల నిలయంగా తెలంగాణ రాష్ట్రం ఉందని ఆయన పేర్కొన్నారు.  ముస్లిం యువతుల వివాహానికి షాదీముబారక్‌ అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరిసేలా కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. మీ అందరి దీవెనలతో రెండోసారి తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందిస్తామని కేటీఆర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, ఎస్పీ రాహుల్‌హెగ్డే తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో కేటీఆర్‌ పాల్గొన్నారు. అంతకు ముందు కేటీఆర్‌ గంభీరావుపేటలో జరిగిన రేణుకాఎల్లమ్మ సిద్దోగంలో పాల్గొన్నారు. 

కేటీఆర్‌ను కలిసిన సమీర్‌ తల్లి 
సౌదీ అరేబియాలో బందీ అయిన మహ్మద్‌ సమీర్‌ (21) తల్లి రఫియా కేటీఆర్‌ను కలసి తన కొడుకును స్వదేశానికి తెప్పించాలని వేడుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన సమీర్‌ ఏప్రిల్‌ 15 గల్ఫ్‌ ఏజెంట్‌ వాహిద్‌ మాటలు నమ్మి సౌదీ అరేబియా వెళ్లాడు. ఫామ్‌ హౌస్‌లో పని అని చెప్పి గొర్రెలు కాపిస్తున్నారని పేర్కొంటూ సమీర్‌ ఏడుస్తూ.. ఇటీవల వాట్సప్‌ ద్వారా కేటీఆర్‌ పంపించారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌ సౌదీలోని భారత రాయభార కార్యాలయానికి సమాచారం అందించారు. పక్షం రోజులుగా సమీర్‌ ఇల్లు చేరకపోవడంతో అతని తల్లి రఫి యా కేటీఆర్‌ను కలిసి  కొడుకును ఇంటికి పం పించే ఏర్పాటు చేయాలని  వేడుకోవాలని కోర గా కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement