‘ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ కష్టాలు’ | Komatireddy Venkat Reddy Slams TRS Over Foundation Day Celebrations | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ కష్టాలు’

Apr 27 2020 3:36 PM | Updated on Apr 27 2020 4:48 PM

Komatireddy Venkat Reddy Slams TRS Over Foundation Day Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్ : అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఒకవైపు తెలంగాణలో అకాల వర్షాల కారణంగా రైతులు కష్టాలపాలవుతుంటే టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు చేసుకోవాటం సిగ్గుచేటుని అన్నారు. సోమవారం ఎంపీ మాట్లాడుతూ..  ఐకేపీ, పీఏసీఎస్‌ సెంటర్లలో ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ 6 నెలల పంటను నీటిపాలు చేశారని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వర్షంతో తడిసి ధాన్యాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుందని, వర్షాల కారణంగా చేతికి వచ్చిన ధాన్యం నీళ్ల పాలు అవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. (‘లూడో’లొ ఓడించిందని భార్యను.. )

15 రోజులుగా ఐకేపీ, పీఏసీఎస్‌ సెంటర్లలో రైతులు పడిగాపులు కాస్తున్న పట్టించుకునే నాధుడే లేడని, ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులకు ఈ కష్టాలు వచ్చాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులకు నష్టం వచ్చినందుకు ప్రభుత్వం భాద్యత వహిస్తూ వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చండూరు, నాంపల్లి, పోచంపల్లి, చింతపల్లి, పలు మండలాల్లో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసిపోయిందని, రైతులను ఇబ్బంది పెట్టకుండా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కాన్వాయిలతో ప్రచారం చేయటం తప్ప రైతులకు చేసిన మేలు ఏమి లేదని విమర్శించారు. (లాక్‌డౌన్‌ సడలింపా.. అదేం లేదు: సీఎం )

టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రచారం తప్ప సేవ చేసే తత్వం లేదని, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి సంబరాలు జరుపుకోవడం విడ్డురంగా ఉందన్నారు. జెండాలు ఎగురవేసి సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నారని గుర్తు చేశారు. వారం రోజుల్లో రైతులకు న్యాయం జరగకపోతే ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. బత్తాయి కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం ఒక్క రైతు దగ్గర కూడా బత్తాయిలను కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బత్తాయి, నిమ్మ, మామిడి పండ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి పేదవాళ్లకు పంచాలని సూచించారు. లాక్‌డౌన్ కారణంగా అంతరాష్ట్రాల ఎగుమతులు నిలిచిపోయిన కారణంగా పండ్లను కొనుగోలు చేయటానికి ఎవరు ముందుకు రావడం లేదని, కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 400 కోట్ల మామిడి,నిమ్మ,బత్తాయి పంట ఉంటుందన్నారు. ప్రభుత్వం ఈ పంటను కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించాలని, మే 7 లాక్ డౌన్ తరువాత రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరుపున పెద్ద ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. (సామాజిక దూరం.. స్టంట్‌ అదిరింది గురూ! )

Advertisement
 
Advertisement
Advertisement