జలాశయాలన్నీ నిండాయి : కేసీఆర్‌

KCR On Water Levels In Reservoirs - Sakshi

తాగు, సాగునీటికి ఢోకా లేదు

సింగూరు, నిజాంసాగర్‌కు చాలినంత నీరు రాలేదు

వచ్చే ఏడాది నుంచి మల్లన్న సాగర్‌ ద్వారా తరలింపు

ప్రణాళిక రూపకల్పనకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జలాశయాలు నిండటంతో సాగు, తాగునీటికీ ఢోకా లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సింగూరు, నిజాంసాగర్‌లకు మాత్రం చాలినంత నీరు రాలేదని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది తాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్, పరిగి, కోమటి బండ, ఎస్‌ఆర్‌ఎస్పీ.. వీటిల్లో వీలైన ప్రాజెక్టు నుంచి వీలైనన్ని గ్రామాలకు నీరందించాలని సూచించారు. మిగతా చోట్ల ట్యాంకర్ల ద్వారా, బోర్ల ద్వారా నీరు అందించాలని కోరారు. ఈ ఒక్క ఏడాదే సింగూరు, నిజాంసాగర్‌ పరిధిలో సమస్య ఉంటుందని, వచ్చే ఏడాది నాటికి మల్లన్న సాగర్‌ ద్వారా నీరందుతుందని చెప్పారు. వచ్చే వేసవిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గురువారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌లో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని కొన్ని చోట్ల పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలున్నాయని అన్నారు. వచ్చే నెలలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రెండ్రోజుల పాటు పర్యటించి స్థానికులతో చర్చించి అటవీ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సాగునీరు, మంచినీటి కోసం శాశ్వత ప్రాతిపదికన చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. 

నిజామాబాద్‌కు కొత్త లిఫ్టులు 
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. గుత్ప, అలీసాగర్‌ మాదిరిగానే లిఫ్టులు పెట్టి బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజవర్గాలకు సాగునీరు అందివ్వాలని పేర్కొన్నారు. ఇందుకు తక్షణమే సర్వే జరిపి, లిఫ్టులు ఎక్కడ పెట్టి, ఏయే గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చో తేల్చాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఏటా 90 టీఎంసీలకు తక్కువ కాకుండా ఎస్సారెస్పీని నింపాలని ప్రభుత్వం నిర్ణయించినందున, దీని నుంచి ఎంత వీలైతే అంత ఆయకట్టుకు నీరివ్వాలని సూచించారు. సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, హనుమంతు షిండే, బియ్యాల గణేశ్‌ గుప్తా, సురేందర్, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఈఎన్‌సీలు శంకర్, సుధాకర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కృపాకర్‌ పాల్గొన్నారు.  
సభలో మాట్లాడుతున్న కేసీఆర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top