సీఅండ్‌ఎండీ కార్యాలయంలో డెరైక్టర్ల నిర్బంధం | In the C&MD office directors are detention | Sakshi
Sakshi News home page

సీఅండ్‌ఎండీ కార్యాలయంలో డెరైక్టర్ల నిర్బంధం

May 21 2014 1:18 AM | Updated on Sep 2 2018 4:16 PM

యూనియన్ల గొడవలో తలదూర్చి ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ రాజిరెడ్డి వర్గం నేత లు మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఆందోళనకు దిగారు.

 శ్రీరాంపూర్/రామకృష్ణాపూర్ , న్యూస్‌లైన్ : యూనియన్ల గొడవలో తలదూర్చి ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ రాజిరెడ్డి వర్గం నేత లు మంగళవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఆందోళనకు దిగారు. సీఅండ్‌ఎండీ కార్యాలయంలో డెర్టైక్టర్లను నిర్బంధించారు. డెరైక్టర్(పా) విజయ్‌కుమార్, డెరైక్టర్(ఆపరేషన్స్) బి.రమేశ్‌కుమార్, జీఎం(పర్సనల్) చంద్రమౌళిలను సీఅండ్‌ఎండీ రూంలో నిర్బంధించి ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ యూనియన్ అధ్యక్షుడు ఎ.కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవిందర్‌రెడ్డి, నాయకులు మేడిపల్లి సంపత్, ఆగయ్య, సారంగపాణి, 11 డివిజన్ల నుంచి ప్రతినిధులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డెరైక్టర్(పా) ఇతర అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చట్టబద్ధంగా గెలిచిన తమతో చర్చలు జరపకుండా ఓడిపోయిన వారితో చర్చలు జరపడానికి సిద్ధపడుతున్నారని దుయ్యబట్టారు. మల్లయ్య వర్గం నేతలపై పక్షపాతం వహిస్తున్నారని విమర్శించారు. గతంలో జాయింట్ మెమో ఇచ్చి 11 మందితో కూడిన అడ్‌హక్ కమిటీతో చర్చలు జరపాలని లెటర్ ఇచ్చినా కూడా చర్చలు జరపకుండా నాన్చివేత ధోరణి అవలంభించారని, ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని చర్చలు జరపకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు. వారికి అవసరం లేకున్నా యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే విధంగా వ్యవహరిస్తూ మల్లయ్య వర్గానికి కొమ్ము కాస్తున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ రవిందర్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు ఫోన్‌లో తెలిపారు.
 
 స్పందించిన యాజమాన్యం
టీబీజీకేఎస్ ఆందోళనతో యాజమాన్యం స్పందించిందని ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవిందర్‌రెడ్డి తెలిపారు. ఆందోళన అనంతరం తమ యూనియన్ నేతలను ఇన్‌చార్జి సీఅండ్‌ఎండీ పిలిచి మాట్లాడారని పేర్కొన్నారు. ఇందులో డెరైక్టర్లు కూడా పాల్గొన్నారని వివరించారు. డివిజన్ స్థాయిలో జరపాలనుకున్న సమావేశాలను జరపరాదని నిర్ణయించారు. డివిజన్ స్థాయిలో ఉన్న సమస్యలను నేరుగా కార్పోరేట్‌కు పంపిస్తే అక్కడ యాజమాన్యం వీటిని పరిష్కరించి ఓ నిర్ణయం తీసుకుంటుందని, దీంతో ఎప్పటికప్పుడు డివిజన్ సమస్యలపై కార్పొరేట్ అధికారులు దృష్టిసారించి పరిష్కరిస్తారని తెలిపారు. ఏ డివిజన్ కమిటీతో చర్చలు జరగడం లేదని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement