వానాకాలానికి కల్వకుర్తి పనులు పూర్తి చేయాలి | harish rao on kalvakurthi project | Sakshi
Sakshi News home page

వానాకాలానికి కల్వకుర్తి పనులు పూర్తి చేయాలి

Jan 28 2018 3:11 AM | Updated on Jan 28 2018 3:11 AM

harish rao on kalvakurthi project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కల్వకుర్తి ప్రాజెక్టు కింద పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ వచ్చే వానాకాలానికి పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శనివారం ఇక్కడ జలసౌధలో నాగర్‌ కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి పనులను ఆయన సమీక్షించారు. నాగర్‌ కర్నూల్‌ శాసనసభ్యుడు మర్రి జనార్దనరెడ్డి ఇటీవల జరిపిన జల విజయయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను మంత్రి పరిశీలించా రు. 60కి పైగా వచ్చిన ఈ విజ్ఞప్తులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

2016–17 లో మొత్తం కల్వకుర్తి కింద 280 చెరువులను నింపగా, ఈ ఏడాది 350 చెరువులను నింపినట్టు అధికారులు తెలిపారు. ఇందులో నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గంలో 120 చెరువులు ఉన్నట్లు చెప్పారు. కల్వకుర్తి కింద మొత్తం ఆయకట్టు 4.25 లక్షల ఎకరాలు ఉండగా.. గతేడాది 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని ఇరిగేషన్‌ అధికారులు పేర్కొన్నారు.  ఈ ఏడాది యాసంగిలో 2 లక్షల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేసినట్టు చెప్పారు.

ప్యాకేజీ–29, 30ల్లో మిగిలిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ పనులు వానాకాలానికి పూర్తి చేయాలని ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేయని ఏజెన్సీని తొలగించి వేరే ఏజెన్సీతో పనులు చేయించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ సీఈ కె.రావు, ఎస్‌ఈ భద్రయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement