
రుణమాఫీ ఆంక్షలపై ఆగ్రహం
పంటల రుణమాఫీ ఆంక్షలపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గురువారం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు.
ఆదిలాబాద్, నిజామాబాద్లలో రోడ్డెక్కిన రైతన్నలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పంటల రుణమాఫీ ఆంక్షలపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గురువారం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దిష్టిబొమ్మలను దనహనం చేశారు. పలుచోట్ల టీఆర్ఎస్ జెండా దిమ్మెలను ధంసం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చాక మోసం చేసేందుకు యత్నిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లో రైతులు రాస్తారోకో చేశారు. రెంజల్ మండలం దూపల్లిలో, వేల్పూరు మండలం మోతె, జాన్కంపేట, ధర్పల్లిలలో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేసీఆర్ తీరును నిరసిస్తూ ఆర్మూర్ మండలం మంధనిలో టీఆర్ఎస్ జెండా దిమ్మెను ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేయగా, గాంధారి మండలం మాతుసంగెంలో గ్రామస్తులు కూల్చివేశారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ రైతులు రాస్తారోకోలు చేపట్టారు.