రియల్‌.. ఫేక్‌ న్యూస్‌!

A Fake news on a devotional channel brought trouble to the four states people - Sakshi

గోపాలాయపల్లి వేణుగోపాలస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అసత్య ప్రచారం చేసినట్టు సమాచారం

సాక్షిప్రతినిధి, నల్లగొండ/నార్కట్‌పల్లి: ఓ భక్తి చానల్‌లో ప్రసారమైన ఒక ఫేక్‌ వార్త నాలుగు రాష్ట్రాల్లోని భక్తులకు చిక్కులు తెచ్చిపెట్టింది. అమావాస్య రోజైన బుధవారం నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లి గుట్ట మీద ఉన్న శ్రీవారిజాల వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పడంతో ఆ ఆలయానికి భక్తులు పోటెత్తారు. 89 ఏళ్లకొకసారి ఇలాంటి ముహూర్తం ఉంటుందని ఈ సమయంలో స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఆ చానల్‌లో జ్యోతిష్యుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ చెప్పడంతో అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచే ఆ ఆలయానికి లక్షల్లో భక్తులు చేరుకున్నారు.

దేవస్థానానికి పోటెత్తిన భక్తులు 

తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలిరావడంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దాదాపు 4 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని సమాచారం. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయాన్ని మూసివేసినా ఆలయ గోడలు దూకి భక్తులు లోనికి ప్రవేశించారు. దేవాలయం చుట్టుపక్కల భూములను అధిక ధరలకు అమ్ముకునేందుకే ఇలాంటి ప్రచారం చేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై నల్లగొండ జన విజ్ఞాన వేదిక, మరికొందరు భక్తులు ఫిర్యాదు చేయడంతో నార్కట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. 

గుర్తించే పనిలో ఉన్నాం: నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ 
 ఒక్కసారిగా దాదాపు 4 లక్షల మంది భక్తులు ఆలయానికి రావడం అనుమానంగా ఉంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో కేసులు నమోదు చేశాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top