అర్ధరాత్రి కలకలం | Fake Call Issue In Adilabad Police Department | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి కలకలం

Aug 30 2018 11:47 AM | Updated on Aug 30 2018 11:47 AM

Fake Call Issue In Adilabad Police Department - Sakshi

ఉండం రైల్వేస్టేషన్‌ వద్ద పోలీసులు, ఇతర శాఖల అధికారులు

ఆదిలాబాద్‌టౌన్‌ : ‘హలో సార్‌.. నేను రైల్వే నుంచి మాట్లాడుతున్నా.. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం ఉండం దగ్గర పూర్ణ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఓ ట్రక్‌ను ఢీకొని బోల్తాపడింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి’ మంగళవారం అర్ధరాత్రి డయల్‌ 100 నంబరుకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి తాను చెప్పాల్సింది చెప్పి పెట్టేశాడు. వెంటనే ఆదిలాబాద్‌ పోలీసుల ఫోన్‌ మోగింది. ఆ కాల్‌ డయల్‌ 100 సెంటర్‌ నుంచి వచ్చింది. రైలు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చింది. ఇక చూడండి.. అర్ధరాత్రి పూట అధికారుల ఉరుకులు.. పరుగులు..!  హుటాహుటిన పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ, తదితర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న రైలులో ప్రయాణం చేస్తున్న వారి బంధువులు, స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఆదిలాబాద్‌ రైల్వే ట్రాక్‌ నుంచి ఉండం వరకు ప్రమాదం ఎక్కడ జరిగిందని వెతుక్కుంటూ వెళ్లారు. తీరా తెల్లవారుజామున 4గంటల సమయంలో రైల్వే అధికారులు మాక్‌ డ్రిల్‌ చేశామని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారో లేదో, సంఘటన జరిగితే స్పందన ఎలా ఉంటుందోనని చావుకబురు చల్లగా చెప్పడంతో అందరూ బిత్తరపోయారు. అయితే ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
రైల్వే అధికారులపై ఫైర్‌..
రైల్వే అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా మాక్‌డ్రిల్‌ నిర్వహించడంపై జిల్లా ఎస్పీతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని రైల్వే అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. పూర్ణ ఎక్స్‌ప్రెస్‌ ట్రక్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడి ఉంటుందని, ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందోనని అంబులెన్స్‌ను, ఫైర్‌ ఇంజన్, తదితర ఏర్పాట్లను చేశామని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా యంత్రాంగంతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల వారికి కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.

మాక్‌డ్రిల్‌ అంటే..
ఏదైనా రైలు ప్రమాదం జరిగితే జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుంది, సంఘటన స్థలానికి ఎంత సమయంలో చేరుకుంటారు, వైద్యసేవలు, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారనే విషయాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు చేపట్టే కార్యక్రమం మాక్‌డ్రిల్‌. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తమై వెంటనే రైల్వే అధికారులు తెలిపిన ఉండం రైల్వే స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ, సీఐలు, ఆర్డీఓ, తహసీల్దార్లు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, ఇదితర శాఖల అధికారులు, సిబ్బంది సైతం స్పందించారు. ఏదేమైనా ఇలాంటి మాక్‌డ్రిల్‌ నిర్వహించే ముందు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంఘటన స్థలంలో డీఎస్పీ నర్సింహారెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ విశ్వప్రసాద్, ఎస్సైలు, పోలీసులు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement