ప్రైవేట్‌ బస్సులు నడిస్తే కార్మికుల శవాలపైనే..

CPI Leader Narayana Meets RTC Workers In Warangal - Sakshi

దుర్మార్గంగా వ్యవహరిస్తే యాజమాన్యంపై కేసు

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

డిపోల వద్ద వంటావార్పు

అర్ధరాత్రి డిపోల వద్ద మోహరించిన పోలీసులు

రీజియన్‌ వ్యాప్తంగా 4,107 మందిలో రిపోర్టు చేసింది 22 మందే...

సాక్షి, హన్మకొండ: రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగుతునన ఆర్టీసీ రూట్లలో ప్రైవేట్‌ బస్సులకు అనుమతిస్తే  అవి కార్మికుల శవాలపై వెళ్లాల్సి ఉంటుం దని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారా యణ హెచ్చరించారు. ప్రైవేట్‌ బస్సులను నడపలేరని, అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను హన్మకొండ డిపో, హన్మకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌ రెడ్డి మంగళవారం కలిసి సం ఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రా వుకు సమ్మెపై అవగాహన లేకపోవడంతోనే కార్మికులే వచ్చి విధుల్లో చేరాలని మాట్లాడుతున్నారని చెప్పారు. పెళ్లి చూపులు లేకుండా, రెం డు కుటుంబాలు చర్చించుకోకుండా పెళ్లి ఎలా జరుగుతుందని వ్యాఖ్యానించారు. కార్మిక వివా దాల చట్టం ప్రకారం నోటీసు ఇచ్చిన తర్వాత కార్మిక శాఖ అధికారులు జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్‌ మందలించడంతో వారు వెనుకడుగు వేశారన్నారు. సమ్మెను ‘ఇల్లీగల్‌’ అని ప్రకటించడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చెప్పారు. యాజమాన్యం చర్చలు జరపకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తే కేసు పెట్టాల్సి ఉం టుందని.. ఆర్టీసీకి ఎండీ లేనందున కేసు సీఎం పైనే పెట్టాల్సి వస్తుందన్నారు. సీఎం నిజాం నవాబులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

విచ్ఛిన్నానికి కుట్ర
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెను పోలీసులతో విచ్ఛిన్నం చేయాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారని మండిపడ్డారు. అయితే, పోలీసులు సీఎం కేసీఆర్‌ ఉచ్చులో పడొద్దని సూచించారు. బుధ వారం నుంచి ఒక్క బస్సు బయటకు రానివ్వద్దని, సీపీఐ కార్యకర్తలు బస్‌ డిపోల ముందు కూర్చోవాలని పిలుపునిచ్చారు. 31 శాతం కలిగి ఉన్న కేంద్రం ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. లేక పోతే బీజేపీకి పుట్టగతులుండవని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా ఇన్‌చార్జి కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ కన్వీ నర్‌ గంభీర్‌ రెడ్డి, కోకన్వీనర్లు ఎం.శ్రీనివాస్, రాజయ్య, యాదయ్య, నాయకులు ఈఎస్‌. బా బు, ఎస్‌కేవై.పాషా, ఎస్‌ఆర్‌ కుమార్, జీ.ఆర్‌. స్వామి, ఎల్లయ్య, సజ్జన్‌ నాయక్‌ పాల్గొన్నారు. 

మిన్నంటిన నిరసనలు
ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. కార్మికులు అదే పట్టుదలతో దూసుకుపోతున్నారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌ విధించినా కార్మికుల్లో పట్టు సడలలేదు. మంగళవారం వరంగల్‌ రీజియన్‌లోని 9 డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. హన్మకొండలోని వరంగల్‌–1, 2, హన్మకొండ డిపో వద్ద ధర్నాతో పాటు వంటావార్పు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌ను కార్మికులు పెద్దగా పట్టించుకోలేదు. చర్చలకు పిలువకుండా వెన క్కి తగ్గేదిలేదని తమకు తాముగా విధుల్లో చేరేది లేదని భీష్మించుకూర్చున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌ రెడ్డితో పాటు సీపీఐ, సీపీఎం నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆర్టీసీ జేఏసీ, కార్మిక సంఘాల నాయకులు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్, శోభన్‌బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. 

ఏం జరుగుతుందో?

హన్మకొండ బస్‌స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పోలీసుల పహారా

ఆర్టీసీ డిపోల వద్ద ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి వరకు డెడ్‌ లైన్‌ విధించింది. దీంతో టీఎస్‌ ఆర్టీసీ డిపోల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు విధుల్లో చేరేందుకు వస్తే యూని యన్‌ నాయకులు అడ్డుకోకుండా ఈ బందోబస్తు ఏర్పాటుచేసినట్లు సమాచారం. ఇక కార్మికులు ఎవరైనా విధుల్లో చేరడానికి వస్తే సహచర కార్మికులు కాపుకాసి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇలా రెండు వర్గాల మొహరించడంతో డిపోలో వద్ద ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది. కాగా, విధుల్లో చేరిన వారికి వెంటనే డ్యూటీలు ఇవ్వకుండా ఈ నెల 7వ తేదీ తర్వాత రావాలని అధికారులు చెబుతున్నారని కార్మిక వర్గాలు వెల్లడించాయి. కేవలం కార్మికులు స్వ చ్ఛందంగా విధుల్లో చేరారని, సమ్మె ప్రభావం లేదని చెప్పడానికి ప్రభుత్వం వేసిన ఎత్తుగడలో ఇది భాగమేనని కార్మికవర్గాలు తెలిపాయి. కా గా, ఇప్పటి వరకు వరంగల్‌ రీజియన్‌లో 4,017 మంది ఉద్యోగులకుగాను 22 మంది రిపోర్టు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

వినూత్న నిరసన
సమ్మెలో భాగంగా మహిళా కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. విధుల్లో చేరేందుకు సీఎం ఇచ్చిన డెడ్‌లైన్‌తో తమకు భయం లేదని.. ఉద్యోగాలు పోయినా చాయ్‌ అమ్ముకోనైనా బతుకుతామని చాటి చెబుతూ టీ అమ్మారు. హన్మకొండ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు వంట వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు అంజనీదేవి, సుమతి చాయ్‌ అమ్మి నిరసన తెలిపారు. అదే సమయంలో వచ్చిన నాయకులు కె.నారాయణ, చాడా వెంకట్‌ రెడ్డి సైతం టీ తాగారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top