పోలీస్‌ అకాడమీలో కరోనా కలకలం  | Covid 19 Tests For All Cadets at TSPA | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అకాడమీలో కరోనా కలకలం 

Jun 21 2020 5:14 AM | Updated on Jun 21 2020 5:14 AM

Covid 19 Tests For All Cadets at TSPA - Sakshi

అకాడమీలోని తరగతి గదిలో భౌతిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చున్న కేడెట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడ మీ (టీఎస్‌పీఏ)లో ఓ అటెండర్‌ కు కరోనా పాజిటివ్‌ రావడంతో అకాడమీ సిబ్బంది, కేడెట్లలో ఆందోళన మొదలైంది. కాగా, అకాడమీలో ఒకే గదిలో 400 మంది వరకు కేడెట్లను కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తూ భౌతిక దూరం తదితర కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అకాడమీలో 1,200 మంది ఎస్సైలు, 650 మంది వరకు విమెన్‌ పీసీ కేడెట్లు శిక్షణ పొందు తున్నారు. వీరు కాకుండా మరో 400 మంది సిబ్బంది బయట నుంచి వస్తారు. కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే క్యాంపస్‌లో ఉంటా రు. లాక్‌డౌన్‌ విధించినా అకాడమీలో కొత్తవారిని రానీయలేదు. లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించిన తరువాత హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరిగాయి. దీంతో టీఎస్‌పీఏ అటెండర్‌ ఉద్యోగికి కరోనా రావడంతో సిబ్బం దిలో కలకలం మొదలైంది.

ఆందోళనకు కారణాలివే..! 
అకాడమీలో భౌతిక దూరం నిబంధన ఏ కోశానా అమలుకావడం లేదని సిబ్బంది వాపోతున్నారు. తరగతిలో 400 మందికిపైగా కేడెట్లు ఒకే హాల్‌లో కూర్చుంటున్నారు. ముఖానికి మాస్కులు వేసుకుంటున్నా.. అంత దగ్గరగా కూర్చోవడంతో కేడెట్లలో కరోనా ఆందోళన మొదలైంది.  రెండు వేల మంది కేడెట్లు, 400 మంది సిబ్బందితో శ్రమదానం సైతం చేయించారు. కరోనా కేసు వెలుగుచూసినా ఎలాంటి మార్పు రాలేదు. అకాడమీలో శనివారం  కల్చరల్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీనికి అందరూ హాజరయ్యారు. కరోనా కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఆదివారం నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నామని ఉన్నతాధికారులు ప్రకటించారు. రూ. 2,800 కట్టిన వారికి ప్రైవేటు సిబ్బంది పరీక్షలు చేస్తారని తెలపడంతో సిబ్బంది నీరుగారిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement