అడుగడుగునా నిర్లక్ష్యం

Committee Sends Report To Govt On Inter Results - Sakshi

సాంకేతిక వైఫల్యాలే ‘ఇంటర్‌’వివాదానికి కారణం

ప్రభుత్వానికి 10 పేజీల నివేదిక అందజేసిన త్రిసభ్య కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో నెలకొన్న వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ శనివారం తమ నివేదికను సమర్పించింది. కమిటీకి చైర్మన్, టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వరరావు, ఐఐటీ ప్రొఫెసర్‌ నిశాంత్‌ డొంగరి, బిట్స్‌ ప్రొఫెసర్‌ ఏ.వాసన్‌ బృందం దాదాపు 5రోజుల పాటు సుదీర్ఘ పరిశీలన చేపట్టిన కమిటీ పది పేజీల నివేదికను రూపొందించింది. పరిశీలన ప్రక్రియంతా నాలుగు ప్రధాన అంశాలుగా విభజించింది. కాంట్రాక్టు సంస్థకు అప్పగించిన విధులు, ఉపయోగించిన మానవ వనరులు, తప్పిదాలు జరిగిన ప్రక్రియ–తీసుకున్న చర్యలు, సాంకేతికత అంశాల ఆధారంగా పరిశీలన చేపట్టింది. వీటిని లోతుగా సమీక్షించిన కమిటీ పలు అంశాలను గుర్తిస్తూ నివేదికను రూపొందించింది. దీంతోపాటుగా పొరపాట్ల సవరణ, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అంశాలపైనా లోతైన విశ్లేషణ చేసి ఐదు అంశాలతో కూడిన సూచనలను నివేదికతో జతచేసి ప్రభుత్వానికి అందించింది. కాగా, త్రిసభ్య కమిటీ నివేదికపై ఇంటర్‌ విద్యా జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, కళింగ కృష్ణకుమార్‌ హర్షంవ్యక్తం చేశారు.

కమిటీ ప్రభుత్వానికి నివేదించిన నివేదికలోని పలు ముఖ్యాంశాలు..
అసౌకర్యం.. ఆగమాగం!

ఇంటర్మీడియట్‌ బోర్డుతో కాంట్రాక్టు సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. డేటా మైగ్రేషన్, మొబైల్‌ యాప్‌కు అనుసంధానమయ్యేలా విద్యార్థుల ఆన్‌లైన్‌ సర్వీసు, అడ్మిషన్‌ మాడ్యూల్, పరీక్షా కేంద్రాల నిర్వహణ (థియరీ, ప్రాక్టికల్‌), ప్రీ ఎగ్జామినేషన్‌ (జంబ్లింగ్, హాల్‌టిక్కెట్ల జనరేషన్‌), పోస్ట్‌ ఎగ్జామినేషన్‌ వర్క్‌ చేయాలి. కానీ నిర్దేశించిన పనులను కాంట్రాక్టు సంస్థ సకాలంలో పూర్తి చేయలేదు. నిర్దేశిత గడువుదాటి పూర్తిచేసినా అందులోనూ చాలా లోపాలున్నాయి. దీంతో కలిగిన అసౌకర్యమే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. దీనికి కాంట్రాక్టు సంస్థతో పాటు ఇంటర్మీడియట్‌ బోర్డుదీ బాధ్యతే.

బాధ్యతల నిర్వహణలో వైఫల్యం
ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్దేశించిన బాధ్యతల్లో కీలక ఘట్టాలను సైతం కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం చేసింది. హాల్‌టికెట్ల జారీ, ఫలితాల విడుదల తదితర కార్యక్రమాలను నిర్దేశించిన తేదీల కంటే ముందుగా మాక్‌టెస్ట్‌ నిర్వహించాలి. ఓకే అనుకన్న తర్వాతే ఫలితాలు వెల్లడి చేయాలి. కానీ ఇందుకు తగిన ప్రామాణిక నిర్వహణ వ్యవస్థను కాంట్రాక్టు సంస్థ ఎక్కడా వినియోగించలేదు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ప్రాజెక్టులో చోటుచేసుకున్న పొరపాట్లు, తప్పిదాలను గుర్తించి పూర్తిస్థాయి నివేదికను గ్లోబరీనాకు అందించారు. గతేడాది అక్టోబర్, నవంబర్‌ నెలలో ఈ తంతు జరిగింది. బోర్డు చేసిన సూచనలను గ్లోబరీనా విస్మరించింది. వీటిని పరిష్కరించకుండానే మళ్లీ ప్రతిపాదనలు పంపగా.. బోర్డు ఆమోదించలేదు. మొత్తంగా ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్దేశించిన బాధ్యతలను నిర్వహించడంలో గ్లోబరీనా పూర్తిగా విఫలమైంది.

ఫలితాల వెల్లడిలో తప్పులు
531 మంది జాగ్రఫీ విద్యార్థుల ప్రాక్టికల్‌ మార్కులు వారి మెమోల్లో కనిపించలేదు. 496 మంది విద్యార్థుల మెమోల్లో వారి మార్కులకు బదులుగా ఏపీ అని వచ్చింది. కొంతమంది విద్యార్థుల మెమోలో ఏఎఫ్‌ అని వచ్చింది. 4,288 మంది ఎంఈసీ విద్యార్థులకు మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టులో సింగిల్‌ డిజిట్‌ మార్కులు వచ్చాయి. ఓఎంఆర్‌ షీట్‌ల బబ్లింగ్‌లో చోటుచేసుకున్న తప్పిదాలతో, కొందరికి సరైన మార్కులు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సాంకేతిక సమస్యల కారణంగానే ఇలాంటి తప్పులు జరిగాయి. విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన మాడ్యూల్‌ను గ్లోబరీనా సంస్థ సకాలంలో అభివృద్ధి చేయలేదు. గతంలో ఈ ప్రక్రియంతా సీజీజీ చూసుకుంది. కానీ తాజాగా ప్రాజెక్టు బాధ్యతలు తీసుకున్న గ్లోబరీనా అన్ని అంశాల్లోనూ దారుణంగా వెనుకబడింది. కనీసం గతేడాది డిసెంబర్‌ నాటికి కూడా వీటిని పూర్తి చేయలేదు. ఫీజు చెల్లింపులు, నామినల్‌ రోల్స్‌లో అసమానతలు, ఆన్‌లైన్‌ ప్రశ్నాపత్రాలు, ప్రాక్టికల్‌ పరీక్షల మార్కుల స్వీకరణ, హాల్‌టిక్కెట్లలో తప్పిదాలు, పరీక్షా కేంద్రాల్లో సరిపోలని విధానంతో భారీగా తప్పిదాలు జరిగాయి. అతి పెద్ద తప్పిదమేమిటంటే ఫలితాల విడుదలకు ముందే.. వచ్చిన రిజల్ట్స్‌ను మరో సంస్థతో ప్రాసెస్‌ చేసి ఉండాల్సింది. రెండు రికార్డులు సరిపోలిన తర్వాత స్పష్టత వచ్చినప్పుడు ఫలితాలను విడుదల చేసుంటే బాగుండేది. గతేడాది అదే తరహాలో చేసినా.. ఇప్పుడు ఇలాంటి పరిశీలనలేమీ లేకుండానే ఫలితాలు విడుదల చేశారు. దీంతోనే గందరగోళం తలెత్తింది.

తక్షణ సూచనలు
సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థతో పాటు ఇంటర్మీడియట్‌ బోర్డు కూడా.. పొరపాట్లను తక్షణమే సవరించాలని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సూచించింది. వీటితోపాటు భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా నూటికి నూరుశాతం కచ్చితమైన ఫలితాలు ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సైతం సూచించింది.

  • ఒక విద్యార్థి మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టుల్లో 80% మార్కులు సాధించి.. రెండో సంవత్సరంలో ఫెయిల్‌ అయినట్లు తేలితే బోర్డు యంత్రాంగం వెంటనే సదరు సబ్జెక్టు జవాబుపత్రాన్ని రీ–వెరిఫికేషన్‌ చేయాలి. వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు ఇవ్వాలి.
  •  ఐవీఆర్‌ ఆధారిత హెల్ప్‌లైన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి. సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తితే వాటిని సంక్షిప్త సమాచారం, ఈమెయిల్‌ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. హాల్‌టిక్కెట్‌ నంబర్‌ను కూడా ఐవీఆర్‌తో క్యాప్చర్‌ చేసేలా ఉండాలి. అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్‌ పంపించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
  • బోర్డు నిర్దేశించిన ప్రాజెక్టును కాంట్రాక్టు సంస్థతోనే కాకుండా మరో స్వతంత్ర సంస్థతో ప్రాసెసింగ్‌ చేయించి రెండింటి ఔట్‌కమ్‌ సరిపోలిన తర్వాతే ఫలితాలు వెల్లడించాలి.
  • త్వరలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అన్ని ప్రక్రియలను మాక్‌టెస్ట్‌ నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. మాక్‌టెస్ట్‌ల్లో ప్రధాన తప్పిదాలు గుర్తిస్తే సవరించేందుకు వీలుంటుంది.

భవిష్యత్తులో ఏం చేయాలంటే!

  • భవిష్యత్తులో నిర్దేశిత ప్రాజెక్టును చేపట్టే కంపెనీ ఎంపిక పక్కాగా ఉండాలి. పరీక్షల నిర్వహణ, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రంగం లో అనుసరిస్తున్న విధానాలు కవర్‌ చేస్తూ  ఆదర్శవంతమైన సర్వీస్‌ ప్రొవైడర్‌ను ఎంపిక చేయాలి.  
  • అడ్మిషన్ల నుంచి ఫలితాల విడుదల వరకు అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు బోర్డులో సీనియర్‌ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ప్రాజెక్టు తీరును పరిశీలిస్తుండాలి. మాక్‌టెస్ట్‌ల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలి.  
  • అన్నీ సర్వీసుల మాడ్యూల్స్‌కు సంబంధించిన ఔట్‌పుట్‌ అందుబాటులోకి వచ్చే కంటే 4 వారాల ముందే టెస్ట్‌డ్రైవ్‌ జరపాలి. నిర్వహణాపరమైన అంశాలను సర్వీస్‌ ప్రొవైడర్‌కు తెలియజేయాలి.
  •  సర్వీసు ప్రొవైడర్‌ అనుసరిస్తున్న పద్దతులన్నింటినీ డాక్యుమెంటేషన్‌ చేయాలి.
  •  అన్ని మాడ్యుల్‌ సర్వీసులకు సంబంధించి ముందుగా మాక్‌ టెస్ట్, బీటా టెస్ట్‌లు తప్పనిసరిగా చేయాలి. అలా చేసిన టెస్ట్‌ల తాలూకు ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నప్పుడు ఇంటర్‌బోర్డు ప్రత్యేక కమిటీ, ఈడీపీ బృందం విశ్లేషించి ఫలితాలు ప్రకటించాలి.
  •  కనీసం రెండు వారాలకు ముందు ఫీడ్‌బ్యాక్‌ను సర్వీస్‌ ప్రొవైడర్‌కు అందజేయాలి.
  •  సమాచార సమన్వయలోపం లేకుండా చూసుకునేందుకు.. ప్రత్యేకంగా టెక్నికల్‌ సెల్‌ ఏర్పాటు చేయాలి. అనుభవం, సరైన పరిజ్ఞానం ఉన్న అధికారులను ఇందులో నియమించాలి.
  • ప్రత్యేక కమిటీల్లో ఉండే వారికి శిక్షణ తరగతులు నిర్వహించి అప్‌డేట్‌ చేయాలి.

పనితీరు అధ్వానం
ప్రాజెక్టులో భాగంగా బోర్డు నిబంధనలకు అనుగుణంగా కావాల్సిన సాంకేతికత, మానవ వనరులను గ్లోబరీనా సంస్థ సమకూర్చింది. ఇంటర్మీడియట్‌ బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చేపట్టాల్సిన కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలి. కానీ.. ఈ ప్రక్రియలో కాంట్రాక్టు సంస్థ బాగా వెనకబడింది. సరైన వనరులను సమకూర్చితేనే నాణ్యతతో కూడిన ఫలితం వచ్చేది. గ్లోబరీనా సంప్థ పనితీరు అసంతృప్తికరంగా, అధ్వానంగా ఉంది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top