మీ ఓటే.. మా భవిష్యత్తు | Childrens Requesting Their Parents To Use The Voting Right | Sakshi
Sakshi News home page

మీ ఓటే.. మా భవిష్యత్తు

Nov 23 2018 2:04 PM | Updated on Nov 23 2018 2:05 PM

Childrens Requesting Their Parents To Use The Voting Right - Sakshi

ఓటు హక్కును వినియోగించుకున్నా.. అంటూ చూపిస్తున్న విద్యార్థిని  , విద్యార్థులు తల్లిదండ్రులకు రాసిన లేఖ

ఆదిలాబాద్‌టౌన్‌: ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు వేసే ఓటుతో మా భవిష్యత్తు ముడిపడి ఉందని జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులను కోరుతున్నారు. ఓటు అనే ఆయుధం గురించి విద్యార్థులు పూర్తి స్థాయిలో తెలుసుకుని తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. విద్యార్థులు వారి వారి మాతృభాషల్లో అమ్మానాన్నకు అర్థమయ్యే రీతిలో ఓటు ప్రాముఖ్యత వివరిస్తున్నారు. విద్యార్థులకు ఓటు వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ఓటు అంశంపై జిల్లాలోని ఆయా పాఠశాలల్లో క్విజ్, ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ దివ్యదేవరాజన్, జాయింట్‌ కలెక్టర్‌ సంధ్యారాణి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలల్లో, డైట్‌ కళాశాలల్లో మాదిరి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటింగ్‌ యంత్రం, వీవీ ప్యాట్‌ గురించి తెలియజేస్తున్నారు. ఓటు అనే ఆయుధంతోనే సమాజంలో మార్పు తీసుకురాగలమనే విషయాలను విద్యార్థులకు వివరిస్తున్నారు. 

విద్యార్థులకు పోటీలు..
జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యం పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ అనే అంశంపై పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రిసైడింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధి కారి, ఇద్దరు పీఓలు, ముగ్గురు ఏజెంట్లు, ఒక పో లీసు కానిస్టేబుల్, ఒక కంప్యూటర్‌ ఆపరేటర్, ఇద్దరు రాజకీయ నాయకులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సెక్టార్‌ అధికారి, పది మంది ఓటర్లు పాత్రల్లో ఎన్నికల నిర్వహణ చేపడుతున్నారు. శని వారం నుంచి మండల స్థాయిలో ప్రథమ, ద్వితీ య, తృతీయ బహుమతులు అందజేయనున్నా రు. 25న జిల్లా స్థాయిలో జెడ్పీ సమావేశ మం దిరంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి జిల్లా స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7,500, తృతీయ బహుమతి రూ.5వేల నగదుతో పాటు షీల్డ్‌ అందజేస్తారు.
నిజ జీవితంలో నేనే రాజకీయ నాయకుడిని అయితే అనే అంశంపై ఇద్దరు విద్యార్థులతో డిబేట్‌ నిర్వహిస్తారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాలతోపాటు ప్రైవేట్‌ కళాశాలల విద్యార్థులు లేఖలు రాసి తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. ఓ సారి ఆలోచించి ఓటు వేయాలని, ఓటుతో మాకేమి పని అంటూ నిర్లక్ష్య ధోరణిని వీడాలని కోరుతున్నారు. డిసెంబర్‌ 7న ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ లేఖలో రాయిస్తున్నారు. ఉత్తమ లేఖ రాసిన పది మందికి బహుమతులను ప్రదానం చేయనున్నట్లు డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement