
భారీవర్షం.. కొట్టుకుపోయిన కార్లు
జంటనగరాల్లో భారీవర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం దాదాపు గంటన్నర, రెండు గంటల పాటు కుంభవృష్టిగా కురిసింది.
జంటనగరాల్లో భారీవర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం దాదాపు గంటన్నర, రెండు గంటల పాటు కుంభవృష్టిగా కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడపడితే అక్కడ ఆగిపోయింది. వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో అయితే కొన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల వైపు నుంచి వచ్చే వాహనాలు దాదాపు గంటకు పైగా ఆగిపోయాయి.
రెండు గంటలపాటు ఆగకుండా కురిసిన వానతో దిల్సుఖ్నగర్, మలక్పేట్, అక్బర్ బాగ్, ఓల్డ్ మలక్పేట్, కాలాడేరా, మలక్పేట్ రైల్వే బ్రిడ్జి, సైదాబాద్, సరూర్నగర్, మీర్పేట్, జిల్లెలగూడ, కొత్తపేట్, బడంగ్పేట్ తదితర కాలనీలు, బస్తీలు జలమయంగా మారాయి. మలక్పేట్, నల్లగొండ క్రాస్రోడ్డు, సైదాబాద్, సరూర్నగర్, ఆర్కేపురం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది.
మైత్రీవనం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ బాగా నిలిచిపోయింది. సికింద్రాబాద్ ప్రాంతంలో వర్షపునీరు వరదలా పొంగి పారుతుండటంతో డ్రైనేజి గోతిలోకి ఆర్టీసీబస్సు కూరుకుపోయింది. అంబర్పేట, ఛేనెంబర్ చౌరస్తా ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
మరోవైపు విశాఖపట్నంఓల కూడా భారీ వర్షం కురిసింది. పగలే చీకటిని తలపించింది. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వాహనాలు నీటమునిగాయి. ఆటోలు నీళ్లలో మునిగి ఆగిపోవడంతో డ్రైవర్లు వాటిని తోసుకుని వెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు కనిపించాయి.