తెలుగు మహాసభలపై మంత్రివర్గ ఉపసంఘం | Cabinet Subcommittee on world Telugu summit: CM KCR | Sakshi
Sakshi News home page

తెలుగు మహాసభలపై మంత్రివర్గ ఉపసంఘం

Dec 5 2017 4:01 AM | Updated on Aug 15 2018 9:40 PM

Cabinet Subcommittee on world Telugu summit: CM KCR - Sakshi

సోమవారం ఎల్బీ స్టేడియంలో తెలుగు మహాసభల ఏర్పాట్లను పరిశీలిస్తున్న కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని ఈ కమిటీలో సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సభ్యులుగా ఉంటారు. సాహిత్య అకాడమీతోపాటు ఇతర సంస్థలు, అధికారుల సమన్వయంతో ఈ కమిటీ తెలుగు మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. తెలుగు మహాసభల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రధాన వేదిక అయిన ఎల్బీ స్టేడియం వద్ద సాహిత్యం, సంగీత కార్యక్రమాలతోపాటు ఆహార ప్రదర్శన, అమ్మకాల కేంద్రాలు (ఫుడ్‌ కోర్టులు), పుస్తక ప్రదర్శన, విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శన, పురావస్తు శాఖ ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. స్టేడియం లోపల, బయట అలంకరణ ఉండాలని, తెలంగాణ సాహితీమూర్తుల కటౌట్లు ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియంలో ప్రతీరోజు సాయంత్రం సాహితీ, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు రవీంద్రభారతి, అందులోని మినీ హాలు, ప్రివ్యూ థియేటర్, తెలుగు విశ్వవిద్యాలయం, భారతీయ విద్యాభవన్, లలిత కళాతోరణం, ఇందిరా ప్రియదర్శి ఆడిటోరియం, ఎల్బీ ఇండోర్‌ స్టేడియంలో సాహిత్య సభలు నిర్వహించాలని చెప్పారు. ప్రారంభ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి వస్తున్నారని, ఈ రెండు కార్యక్రమాలు ఎల్బీ స్టేడియంలోనే నిర్వహించాలని పేర్కొన్నారు. అందుకు వీలుగా పార్కింగ్, ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేయాలన్నారు. మహాసభల సందర్భంగా ఒకరోజు తెలుగు సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఆహార్యం, ఆహారం, సంçస్కృతి, కళలు, జీవితం, పండుగలు ప్రతిబింబించేలా లఘుచిత్రానికి(డాక్యుమెంటరీ) రూపొందించాలని సూచించారు.

సమీక్షకు ముందే సీఎం ఎల్బీ స్టేడియం సందర్శించారు. ప్రధాన వేదికతోపాటు మొత్తం ప్రాంగణాన్ని పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అధికారులకు సూచించారు. ఈ నెల 15 నుంచి 19 వరకు తెలుగు మహాసభలు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీజీపీ ఎం.మహేందర్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు సునీల్‌ శర్మ, బుర్రా వెంకటేశం, స్పోర్ట్‌ అథారిటీ ఎండీ దినకర్‌ బాబు, సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, కార్యదర్శి నర్సింహరెడ్డి, నగర పోలీస్‌ కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ గణపతి రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement