
బుధవారం హైదరాబాద్లో బీఆర్కే భవన్ వద్ద అభివాదం చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్
కాళేశ్వరం నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
సాంకేతిక అంశాలపై ఇంజనీర్లు, నిపుణులు నిర్ణయాలు తీసుకున్నారు
152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదు
అక్కడ నీటి లభ్యత సైతం లేదని సీడబ్ల్యూసీ తేల్చింది
తుమ్మిడిహట్టికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లు నిర్మించాలని వ్యాప్కోస్ సూచించింది.... ఈ నేపథ్యంలోనే ‘ప్రాణహిత–చేవెళ్ల’ రీఇంజనీరింగ్ చేపట్టాం
బరాజ్ల లొకేషన్ల ఎంపిక, వాటిలో నీటి నిల్వలపై ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారని వెల్లడి
కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఇన్కెమెరా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించిన కమిషన్
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం భారీ ప్రాజెక్టు. దీనికి సంబంధించిన నిర్ణయాలన్నీ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే తీసుకున్నాం. సాంకేతికపరమైన అంశాలపై ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం కట్టాలని తొలుత రాజకీయ నిర్ణయం మేమే (ప్రభుత్వం) తీసుకున్నాం. తుమ్మిడిహట్టికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లు నిర్మించాలని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సూచించింది..’ అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్.. బుధవారం బీఆర్కేఆర్ భవన్లోని కార్యాలయంలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో ఆయన 115వ సాక్షిగా పాల్గొన్నారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
తుమ్మిడిహట్టి వద్ద సాధ్యం కాకపోవడం వల్లే..
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్ల నిర్మాణంపై నిర్ణయం ఎవరిది అని కమిషన్ ప్రశ్నించగా, కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణాన్ని నాటి మహారాష్ట్ర సీఎం పృథీ్వరాజ్ చవాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ను నేను స్వయంగా కలిసి 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి సహకరించాలని కోరితే ససేమిరా అన్నారు.
148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే సహకరిస్తామన్నారు. ప్రాణహిత–చేవెళ్ల కింద 160 టీఎంసీలను తరలించాల్సి ఉండగా, తుమ్మిడిహట్టి వద్ద అంత నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాధ్యం కాకపోవడం వల్లే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేపట్టాం. ప్రత్యామ్నాయాలపై వ్యాప్కోస్ ఆధ్వర్యంలో లైడార్ సర్వే చేయించగా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు బరాజ్లు నిర్మించాలని సిఫారసు చేసింది.
బొగ్గు గనులు ఉండడంతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీళ్లను తరలించడం సాధ్యం కాదని తేల్చింది. అందుకే మూడు బరాజ్లు నిర్మించి ఎల్లంపల్లికి నీళ్లను ఎత్తిపోయాలనే నిర్ణయం జరిగింది. మేడిగడ్డ వద్ద 230 టీఎంసీల జలాల లభ్యత ఉందని వ్యాప్కోస్ తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను కేంద్రం నుంచి తీసుకున్నాం. బరాజ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం ఉంది. మంత్రివర్గ ఆమోదంతోనే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు జరిగాయి..’ అని కేసీఆర్ చెప్పారు.
ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లవే...
బరాజ్ల లొకేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఇంజనీర్లు, సాంకేతిక బృందం తీసుకుందని కేసీఆర్ బదులిచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 4 వేల మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. బరాజ్ల నుంచి పంప్హౌస్ల ద్వారా నీళ్లను ఎత్తిపోసేందుకు అవసరమైన స్థాయిల్లో నిల్వలను కొనసాగించే అంశంపై ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక అంశాల్లో నిర్ణయాలన్నీ ఇంజనీర్లే తీసుకున్నారు.
మంత్రివర్గ ఆమోదంతో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ఏర్పాటుకు అనుమతిచ్చాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత ఉండడంతో రుణాల సమీకరణ కోసం దీనిని ఏర్పాటు చేశాం. ప్రాజెక్టుకు ఆదాయం సమకూరే వరకు రుణాల తిరిగి చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదే..’ అని మాజీ సీఎం చెప్పారు.
బరాజ్ల నిర్వహణకు రూ.280 కోట్ల నిధులిచ్చాం..కానీ
మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సీపేజీ ఏర్పడడం వెనక నిర్వహణ, పర్యక్షణ లోపాలు సైతం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ స్పందించారు. బరాజ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం రూ.280 కోట్లను కేటాయిస్తూ 2020లో తమ ప్రభుత్వం జారీ చేసిన జీవో 45 ప్రతిని కమిషన్కు అందజేశారు. నిధులు మంజూరు చేసినా ఇంజనీర్లు వాడుకోలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ క్వాలిటీ కంట్రోల్ డివిజన్నే ఏర్పాటు చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ రూపొందించిన ఓ పుస్తకాన్ని కూడా కమిషన్కు కేసీఆర్ అందజేశారు. మాజీ మంత్రి హరీశ్రావు ఇటీవల విలేకరుల సమావేశంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్నే పుస్తక రూపంలోకి మార్చి కమిషన్కు ఇచ్చారు.
సిబ్బందిని, మీడియాను బయటకు పంపించి..
క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఇప్పటివరకు హాజరైన ఇతర సాక్షులందరినీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ కార్యాలయ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధుల సమక్షంలో బహిరంగంగానే ప్రశ్నించింది. అయితే అనారోగ్య సమస్యల కారణంగా బహిరంగ విచారణలో పాల్గొనలేనని, తనను ప్రశ్నించేటప్పుడు ఎవరినీ అనుమతించరాదని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిపై కమిషన్ సానుకూలంగా స్పందించింది.
కోర్టు హాలు నుంచి అందరినీ బయటకు పంపించి ‘ఇన్ కెమెరా’ విధానంలో (కేవలం కేసీఆర్, కమిషన్ కార్యదర్శి మాత్రమే ఉన్నప్పుడు) క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. జస్టిస్ ఘోష్ అడిగే ప్రశ్నలు, కేసీఆర్ ఇచ్చే సమాధానాలను కంప్యూటర్పై టైప్ చేసేందుకు కమిషన్ కార్యదర్శిని అనుమతించారు.
18 ప్రశ్నలు...50 నిమిషాలు
మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు 50 నిమిషాల పాటు సాగి 12.50 గంటలకు ముగిసింది. కేసీఆర్కు కమిషన్ 18 ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. కేసీఆర్ను కమిషన్ కార్యాలయానికి తోడ్కొని వచ్చిన వారిలో మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు.
ముగిసిన క్రాస్ ఎగ్జామినేషన్
కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం లోపాలు బయటపడ్డాయి.
ఈ మూడు బరాజ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. దీంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు, మాజీ మంత్రులకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కమిషన్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుండగా, ఆ లోగానే ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచే అవకాశం ఉంది.