-
ఉద్యోగుల సమస్యలపై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ
-
ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని వెల్లడించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కలిగిన ఉద్యోగ సంఘాల నాయకులతో సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉద్యోగులకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు. పీఆర్సీ, డీఏ బకాయిలు రెండింటినీ కలిపి ఒకటిగా చేసి చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయని, ప్రభుత్వం అందుకు అంగీకరించినట్లు చెప్పారు. మూడు నెలలకు ఒక విడత చొప్పున, సంవత్సరానికి నాలుగు విడతలు, నాలుగేళ్లలో 16 విడతల్లో ఈ బకాయిలను ఉద్యోగులకు ఇస్తామని వివరించారు. మొదటి సంవత్సరం పది శాతం, రెండో సంవత్సరం 20 శాతం, మూడో సంవత్సరం 30 శాతం, నాలుగో సంవత్సరం 40 శాతం చొప్పున ఇస్తామన్నారు. ఏటా పది శాతం చొప్పున పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల్లో మొత్తం బకాయిలను ఇస్తామన్నారు. దీనికి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయన్నారు. సీపీఎస్ కంటే మెరుగ్గా ఉద్యోగులకు సీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలు చేస్తామని మంత్రి బొత్స తెలిపారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ఇకపై 010 పద్దు ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. త్వరలో కొత్త పీఆర్సీ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. ఉద్యోగుల స్పెషల్ పే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ అంశాలన్నింటికీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం శాఖల వారీగా ఉత్తర్వులిస్తామన్నారు. ఆలస్యమైనా.. అనుకూలంగానే ఇది ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగులంతా తమ సోదరులేనని మంత్రి బొత్స పేర్కొన్నారు. తమ కుటుంబాల్లోనూ ఉద్యోగులున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల వల్ల వారికి ఇవ్వాల్సిన వాటి విషయంలో కొంత ఆలస్యం జరిగిందే కానీ, ఉద్యోగుల పట్ల సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి మొదటిరోజు చెప్పిన మాటకే సీఎం కట్టుబడి ఉన్నారని, దాని ప్రకారమే వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఓపిగ్గా సంప్రదింపులు జరిపిన ఉద్యోగ సంఘాలకు బొత్స అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్యం) చిరంజీవి చౌదురి, ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ కేవీవీ సత్యనారాయణ (సర్వీసెస్, హెచ్ఆర్), కార్యదర్శి పి.భాస్కర్, ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, పీఆర్టీయు అధ్యక్షుడు కృష్ణయ్య, యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు, ఏపీజీఈఏ కార్యదర్శి ఆస్కార్రావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 71 డిమాండ్లు నెరవేరాయి: బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎదుట ఉంచిన 71 డిమాండ్లలో దాదాపు అన్నీ పరిష్కారమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఐదేళ్లకోసారి పీఆర్సీ డిమాండ్ను పోరాడి సాధించుకున్నాం. ఆ డిమాండ్ ప్రకారం 7వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో పీఆర్సీ కమిషన్ను నియమిస్తామన్నారు. స్పెషల్ పే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొత్తగా ఏర్పడిన 8 జిల్లాలకు హెచ్ఆర్ఏను 16 శాతం పెంచడం మంచి విషయం. ఇన్నాళ్లూ వైద్య శాఖలో ఏబీవీపీని ఓ ప్రైవేట్ కంపెనీలా చూసేవారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు దక్కినందుకు అభినందిస్తున్నాం. సీపీఎస్ ఉద్యోగుల విషయాన్ని కేబినెట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. అన్నీ పాజిటివ్ అంశాలే : వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన సమావేశంలో అన్ని అంశాలు ఉద్యోగులకు పాజిటివ్గా ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. సీఎం గతంలో చెప్పినట్లుగా పీఆర్సీ కమిషన్ను నియమిస్తామన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారికి పెన్షన్ భద్రత కల్పించేలా చూస్తామన్నారు. స్పెషల్ పే ఇవ్వడానికి అంగీకరించారు. డీఏ, పీఆర్సీ బకాయిలను నాలుగేళ్లలో విడతలవారీగా ఇస్తామన్నారు. పలు సానుకూల నిర్ణయాలు: బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను చాలా వరకు నెరవేర్చింది. ఉద్యోగులకు అనుకూలంగా చాలా సానుకూల నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. పీఆర్సీ, డీఏ బకాయిలు మొత్తం రూ.7 వేల కోట్లు ఉంటాయి. వాటిని నాలుగేళ్లలో విడతలవారీగా చెల్లించేందుకు అంగీకరించారు. విభజన నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సుమారు 7, 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు అంగీకరించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపైనా సానుకూలంగా స్పందించారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వచ్చే కేబినెట్లో తీర్మానం చేస్తామన్నారు. ఇది కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.మురళీరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. 2014కు ముందు ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ నిర్ణయం తీసుకోవడం వారికి శుభవార్త అంటూ ఈ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతీ ఉద్యోగి సీఎంకు అండగా నిలుస్తారన్నారు. 22 ఏళ్ల సుదీర్ఘ కల నెరవేరుతోంది.. సీఎంకు ఏపీ స్టేట్ కాంట్రాక్టు ఫార్మసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఏపీ స్టేట్ కాంట్రాక్టు ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ స్వాగతించింది. 22 ఏళ్ల తమ సుదీర్ఘ కలను నెరవేరుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2001 నుంచి శాశ్వత ఉద్యోగ నియామకాలకు స్వస్తి పలికి కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకుంటూ వచ్చారని.. ఇప్పుడు 2–06–2014కు ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిని ముఖ్యమంత్రి జగన్ రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.రత్నాకర్బాబు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉద్యోగులకు బకాయిల చెల్లింపు ప్రారంభం
సాక్షి, అమరావతి: ఈ నెల ఏడో తేదీన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీ మేరకు ఆరు రోజుల్లోనే ఉద్యోగులకు వివిధ రకాల బకాయిల చెల్లింపులను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెల 31వ తేదీలోగా ఉద్యోగులకు సంబంధించిన రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ తొలుత ఏపీజీఎల్ఐ క్లెయిమ్లను చెల్లించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన నగదు సోమవారం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమకానుంది. అలాగే జీపీఎఫ్కు సంబంధించిన కొన్ని బిల్లులను కూడా ఆర్థిక శాఖ క్లియర్ చేసింది. మంత్రివర్గ ఉప సంఘం చెప్పిన విధంగా ఉద్యోగులకు ఈ నెల 31వ తేదీలోపు రూ.3వేల కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. హామీని నెరవేరుస్తున్న ప్రభుత్వం: ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ నెల 31 నాటికి ఉద్యోగులకు సంబంధించిన వివిధ బకాయిలు రూ.3వేల కోట్లను చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అరవ పాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హామీల అమల్లో భాగంగా మొదటగా ఏఈపీజీఎల్ఐ క్లెయిమ్స్ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన నగదు సోమవారం ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. జీపీఎఫ్కు సంబంధించి కూడా కొన్ని బిల్లులు క్లియర్ చేసినట్లు చెప్పారని, మిగతా బిల్లులు కూడా షెడ్యూల్ ప్రకారం మార్చి 31లోపు చెల్లిస్తామని తెలిపినట్లు అరవ పాల్ వివరించారు. -
ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిమూలపు సురేష్ చెప్పారు. సీఎం ఆదేశాల ప్రకారం ఈ నెలాఖరుకల్లా ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదురి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సజ్జల, ఆదిమూలపు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సజ్జల మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమంపై ఎప్పుటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, అందరూ కలిసికట్టుగా పనిచేయడంవల్లే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతోందన్నారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు కొలిక్కివస్తున్నాయని చెప్పారు. కోవిడ్వల్ల ఉద్యోగులకు చేయాల్సిన వాటిని కొన్నింటినీ సమయానికి చేయలేకపోయామని తెలిపారు. చర్చల ద్వారానే ఆయా సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు చెప్పారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకే సీఎం జగన్ మంత్రివర్గ ఉపసంఘాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు ఏ విషయాన్నయినా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ వేదికను ఏర్పాటుచేశారని చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులకు అనుకూలంగానే ఉంటుందన్నారు. బిల్లులు పెండింగ్లో లేకుండా చేస్తాం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లులను మార్చి 31లోపు క్లియర్ చేస్తామన్నారు. ఇప్పటివరకు ఉన్న జీపీఎఫ్ పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామన్నారు. రిటైర్మెంట్కి సంబంధించి గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ను పూర్తిగా చెల్లిస్తామన్నారు. మెడికల్ బిల్లుల్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా చెల్లిస్తామని చెప్పారు. టీఏ, ఏపీజీఎల్ఐ కూడా ఇస్తామన్నారు. ఆర్థికపరమైన అన్ని అంశాలపై చర్చించామని, దీర్ఘకాలికంగా ఉండి గత ప్రభుత్వంలో కూడా పరిష్కారం కాని అంశాలపైనా స్పష్టత ఇచ్చామని, పరిష్కార మార్గం కనుగొన్నామన్నారు. ఉద్యోగ సంఘ నాయకులతో మంత్రివర్గం ఉపసంఘం తరచూ సమావేశమవుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఏ బిల్లులు పెండింగ్లో లేకుండా చూస్తామని మంత్రి చెప్పారు. మార్చి 31లోగా పెండింగ్ బిల్లుల చెల్లింపు ఉద్యోగులకు ఈ నెల 31లోగా రూ.3 వేల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మహిళా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తంచేశారు. 2004కు ముందు ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్లకు సీపీఎస్ నుంచి ఓపీఎస్కు మారడానికి అనుమతించడానికి సానుకూలంగా స్పందించారు. వీఆర్ఏలకు డీఏ పునరుద్ధరణ, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 62 ఏళ్ల వయోపరిమితి ఉత్తర్వులు ఇవ్వడానికీ ఒప్పుకున్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించడంతో పాటు, రెండో దశలో నియామకమైన వారికి త్వరగా ప్రొబేషన్ డిక్లరేషన్కు అంగీకరించారు. మేం పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాం. వీఆర్వోలకు ప్రమోషన్ కోటా 75 శాతం చేయడం, జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు 010 కింద వేతనాల చెల్లింపుకు డిమాండ్ చేశాం. గ్రేడ్–2 వీఆర్వోలకు ప్రొబేషన్ డిక్లరేషన్, సమగ్ర శిక్ష ఉద్యోగాలకు వేతనాల పెంపు, గత ప్రభుత్వం కక్ష సాధింపుగా ఉద్యోగుల మీద పెట్టిన ఏసీబీ కేసుల్లో బాధితులకు త్వరగా న్యాయం చేయాలని కోరాం. – ఎ. వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు పెండింగ్ బిల్లుల చెల్లిస్తామన్నారు ఉద్యోగుల బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించింది. డీఏ బకాయిలను రెండు క్వార్టర్లలో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.3 వేల కోట్లు క్లియర్ చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్యలు తీసకుంటామని చెప్పారు. రూ.16వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే వారికి బయోమెట్రిక్ తొలగించాలని కోరాం. ఈ నెల 16న ఉద్యోగుల హెల్త్కార్డులకు సంబంధించి సీఎస్ దగ్గర సమావేశం ఉంది. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని కోరాం. – బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పెండింగ్ డీఏలపై చర్చిస్తామన్నారు పెండింగ్ డీఏల విషయంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్ రద్దుపైనా చాలాసేపు చర్చించాం. త్వరలో మా సంఘం కార్యవర్గ సమావేశం ఏర్పాటుచేసుకుని ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి, చైర్మన్ -
దేశంలోనే అత్యంత వేగంగా సమగ్ర సర్వే
సాక్షి, అమరావతి: దేశంలో సమగ్ర సర్వే ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉందని, ఈ ఏడాది చివరి నాటికి సర్వే ప్రక్రియ పూర్తి కావాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. వెలగపూడి సచివాలయంలో జగనన్న భూ హక్కు–భూ రక్ష పథకంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశమైంది. ఉప సంఘం సభ్యులు మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి పథకం ప్రగతిని సమీక్షించారు. మంత్రులు మాట్లాడుతూ 2023 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని మొత్తం 17,461 గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కోరారు. బ్రిటీష్ పాలన తరువాత రాష్ట్రం అంతా కూడా ఒకేసారి నిర్థిష్టమైన విధానంతో జరుగుతున్న ఈ సర్వేలో ఎటువంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ఇప్పటి వరకు దాదాపు రెండు వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసి, శాశ్వత భూహక్కు పత్రాలను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నదన్నారు. భూ యజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారించి, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. మున్సిపాలిటీల్లోనూ సమగ్ర సర్వేను ప్రారంభించాలని సూచించారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.సాయిప్రసాద్, సర్వే, సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ సౌరబ్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement