రోడ్డు ప్రమాదంలో బిల్ కలెక్టర్ మృతి | bill collector died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బిల్ కలెక్టర్ మృతి

Apr 30 2015 6:53 PM | Updated on Aug 30 2018 3:56 PM

గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొన్న ప్రమాదంలో ఓ బిల్‌ కలెక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి గేటు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

మొయినాబాద్ : గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ బిల్‌ కలెక్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి గేటు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఏఎస్సై అంతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన దంతోజి శ్రీనివాస్‌రెడ్డి (45) నగరంలోని చందానగర్ మదీనాగూడ ప్రాంతంలో ఉంటూ వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆయన బుధవారం విధులకు వెళ్లి తిరిగి రాత్రి 11 గంటల సమయంలో వికారాబాద్ నుంచి బైక్పై ఇంటికి వెళ్తున్నాడు.

మార్గమధ్యంలో మొయినాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి గేటు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఆయన బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ దాదాపు 100 అడుగుల దూరం వరకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వాహనదారుల సమాచారంతో ఏఎస్సై అంతిరెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి గురువారం కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య అరుణ, కొడుకు, కూతురు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement