బైక్‌ల దొంగ పరార్..! | Sakshi
Sakshi News home page

బైక్‌ల దొంగ పరార్..!

Published Tue, Sep 2 2014 2:59 AM

Bike thief parar

మోత్కూరు :పోలీస్‌కస్టడీలో ఉన్న ఓ బైక్‌ల దొంగ పరారయ్యాడు. ఈ ఘటన మోత్కూరు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ఏవూరి శివకుమార్ అలియాజ్ శివ, వెంకి, విక్రం, విక్కి పొడిచేడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సమీప బంధువు. శివకుమార్ గతంలో గ్రామానికి చెందిన కొందరికి నాలుగైదు బైక్‌లు విక్రయించాడు. కాగా,ఇటీవల గ్రామానికి చెందిన కప్ప శ్రీరాములు తన బైక్‌ను ఇంటి ఎదుట పార్క్ చేయగా గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. దీంతో ఇటీవల బైక్‌లు విక్రయించిన శివకుమార్‌పై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తూ అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ఇవే కాక పలు ప్రాంతాల్లో సుమారు 38 బైక్‌లు అపహరించినట్లు ఒప్పుకున్నాడు. వాటిలో 9 బైక్‌లను పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. మిగతా బైక్‌లను కూడా రికవరీ చేసేందుకు అతడిని విచారిస్తున్నారు. ఈలోగా శివకుమార్ పోలీసుల కన్నుగప్పి పరారైనట్లు తెలిసింది.
 
 సిబ్బంది నిర్లక్ష్యంతోనే..
 తమ అదుపులో ఉన్న శివకుమార్ పరారైంది వాస్తవమేనని ఎస్‌ఐ అబ్బు రంజిత్‌రెడ్డి తెలిపారు. తాను గణేష్ ఉత్సవాల బందోబస్తుకు వెళ్లగా సిబ్బంది నిర్లక్ష్యంతో ఘటన చోటు చేసుకుందని వివరించారు.  
 

Advertisement
Advertisement