వేములవాడలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు
సాక్షి, సిరిసిల్ల : కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ శుక్రవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ చేరుకున్న ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్డీఏ తరఫున 351 మంది సభ్యులు అధికారంలోకి రావడంతో.. 351 కోడెలను కట్టి రాజన్న మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు బండి సంజయ్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. ప్రజల తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేద ప్రజల కోసం పని చేస్తానని అన్నారు. రాజన్న ఆశీస్సులతోనే తాను గెలిచానని తెలిపిన ఆయన.. ఆలయ అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భాగస్వామ్యం అవుతానని.. అందరితో కలిసి ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని తెలిపారు. బీజేపీ ఎటువంటి అవకాశం ఇచ్చినా పని చేస్తానని పేర్కొన్నారు.