కన్నీటి వీడ్కోలు.. | Ayyappa Swamulu held the funeral on Tuesday | Sakshi
Sakshi News home page

కన్నీటి వీడ్కోలు..

Jan 9 2019 3:13 AM | Updated on Jan 9 2019 3:13 AM

Ayyappa Swamulu held the funeral on Tuesday - Sakshi

సాక్షి, మెదక్‌/నర్సాపూర్‌: తమిళనాడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన 9 మంది అయ్యప్ప స్వాములకు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. రోడ్డు ప్రమాదం జరిగిన మూడ్రోజుల తర్వాత మంగళవారం మృతదేహాలు మెదక్‌ జిల్లాలోని స్వస్థలాలకు చేరుకున్నాయి. 6 గ్రామాల్లో వేర్వేరుగా మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతు ల అంతిమయాత్ర, అంత్యక్రియల సందర్భంగా కుటుంబసభ్యులు గుండెలు అవిసేలా రోదించారు.  తమిళనాడులోని పుదుకోట్టై సమీపంలోని రామేశ్వరం రహదారి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్‌ జిల్లాకు చెందిన 9 మంది అయ్యప్ప స్వాములు, సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలానికి చెందిన డ్రైవర్‌ మృతి చెందిన విష యం తెలిసిందే.

నర్సాపూర్‌ మండలంలోని కాజీపేట, మంతూరు, రెడ్డిపల్లి, చిన్నచింతకుంట గ్రామా లకు చెందిన మృతులు నాగరాజుగౌడ్, బోయినికుమార్, మహేశ్‌ యాదవ్, శివసాయిప్రసాద్, శ్యాం సుందర్‌గౌడ్, ఆంజనేయులు, కృష్ణాగౌడ్, సురేశ్, ప్రవీణ్‌గౌడ్‌ ప్రమాదంలో మృతి చెందారు. మృతులను కడసారి చూసేందుకు కాజిపేట, మంతూరు, రెడ్డిపల్లి, చిన్నచింతకుంటల నుంచి బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో నర్సాపూర్‌ తరలివచ్చారు. నర్సాపూర్‌ సబ్‌స్టేషన్‌ జంక్షన్‌ వద్ద మృతులకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ నగేశ్, మెదక్‌ జెడ్పీచైర్‌పర్సన్‌ రాజమణి, మాజీ మంత్రి సునీతారెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు మురళీ యాదవ్, చంద్రాగౌడ్, బీజేపీ నేత గోపి తదితరులు నివాళులర్పించారు. మృతులకు సంతాప సూచకంగా యువకులు నర్సాపూర్‌ సబ్‌స్టేషన్‌ జంక్షన్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు.  

మృతులకు కన్నీటి వీడ్కోలు 
మూడ్రోజులుగా మృతదేహాల రాకకోసం ఎదురుచూస్తున్న మృతుల కుటుంబ సభ్యులు మంగళవారం ఇళ్ల ముందుకు అంబులెన్స్‌లు రావడంతో ఒక్కసారిగా చుట్టిముట్టారు. తమవారి మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, భార్యాపిల్లలు రోదించా రు. దీంతో పల్లెల్లో విషాద వాతావరణం అలుముకుంది. ఆశ్రునయనాల మధ్య మృతులకు కన్నీటి వీడ్కోలు పలికారు. 

Advertisement
 
Advertisement
Advertisement