నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి హోటల్ గదిలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మిర్యాలగూడ (నల్లగొండ జిల్లా): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి హోటల్ గదిలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి .. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనుమల్ల నెల్లూరు గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ రెడ్డి(28) మంగళవారం సాయంత్రం వైష్ణవి హోటల్లో దిగాడు. కాగా, బుధవారం ఉదయం హోటల్ సిబ్బంది తలుపు కొట్టినా తీయలేదు. మధ్యాహ్నం సమయంలో భోజనం కోసం మరో సారి తలుపు కొట్టారు.
ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా క్రాంతి ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


