సాక్షి, నల్లగొండ జిల్లా: మిర్యాలగూడలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. నకిలీ కంటి డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుభవం, అర్హత లేకుండా వైద్యం చేస్తున్న ఐదుగురు నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశారు. ధనార్జనే ధ్యేయంగా వైద్యుల ముసుగులో కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. ఓ మహిళ ఫిర్యాదుతో నకిలీ డాక్టర్ల బాగోతం బయటపడింది. వారిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.
కాగా, ఇటీవల భద్రాచలంలో నకిలీ సర్టిఫికెట్లతో ఎటువంటి వైద్య విద్యార్హతలు లేకుండా నకిలీ సర్టిఫికెట్లతో గత కొంతకాలంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైద్య అధికారులకు ఫిర్యాదు అందడంతో ఆయూషి నర్సింగ్ హోమ్లో తనిఖీలు నిర్వహించిన వైద్యాధికారులు.. నకిలీ సర్టిఫికెట్లను గుర్తించారు. తనిఖీల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆయుషి నర్సింగ్ హోమ్ను సీజ్ చేశారు. అర్హత లేని వ్యక్తుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యాధికారులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.


