సాక్షి మిర్యాలగూడ: వచ్చే సాధారణ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. బుధవారం మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18మున్సిపాలిటీలు ఉన్నాయని అన్నింటా విజయం సాధించి సీఎం రేవంత్ రెడ్డికి ఈ విజయాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని మంత్రి కోరారు.
ఇటీవల ఒకవ్యక్తి తెలంగాణ జాతిపిత అంటూ బయిలుదేరారని.. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం మంత్రి పదవికి తాను కూడా రాజీనామా చేశానని తనని కూడా అలానే పిలుస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన 1100 మంది బిడ్డలే రాష్ట్రానికి అసలైన జాతిపితలని మంత్రి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం నల్లగొండ ముద్దుబిడ్డ శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఇషాన్ రెడ్డి లాంటి వారు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని వారంతా ఇప్పుడు స్వర్గంలో ఉన్నారని తెలిపారు.
ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, తనతో పాటు సహాచర మంత్రులతో పాటు ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇయ్యాలని నిర్ణయించామని తాను తిన్న బియ్యమే ప్రజలకు ఇస్తున్నామన్నారు. దీంతో మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ ఇండస్ట్రీలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు.


