మహిళలకేదీ రక్షణ? | The protection of the woman? | Sakshi
Sakshi News home page

మహిళలకేదీ రక్షణ?

Apr 8 2014 12:49 AM | Updated on Aug 29 2018 8:54 PM

మహిళలకేదీ రక్షణ? - Sakshi

మహిళలకేదీ రక్షణ?

బీజేపీ హయాంలో రాష్ర్టంలోని మహిళలకు రక్షణ కరువైందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

  • రాష్ర్టంలో నాటి ‘బీజేపీ పాలన’పై రాహుల్ ధ్వజం
  •  సాక్షాత్తు ఓ మంత్రే అత్యాచారానికి పాల్పడ్డాడు
  •  అసెంబ్లీలోనే మొబైళ్లలో అశ్లీల దృశ్యాలు చూస్తూ దొరికిపోయారు
  •  మంగళూరు పబ్‌లో మహిళలపై ఛాందస వాదుల దాడులు
  •  అవినీతికి పాల్పడి అనేక మంది మంత్రులు జైలు పాలు
  •  మేం అధికారంలోకి వస్తే హార్డ్‌వేర్ కేంద్రంగా బెంగళూరు
  •  మోడీ ఉన్మాది.. మతఛాందస వాది
  •  ప్రధానమంత్రి పదవికి అనర్హుడు
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు/ రాయచూరు రూరల్, న్యూస్‌లైన్  : బీజేపీ హయాంలో రాష్ర్టంలోని మహిళలకు రక్షణ కరువైందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. సాఫ్ట్‌వేర్ రంగంలో విశ్వ విఖ్యాతి గడించిన బెంగళూరు హార్డ్‌వేర్ కేంద్రంగా కూడా ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. కేంద్రంలో మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఈ దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు బసవనగుడిలోని నేషనల్ కాలేజీ మైదానంలో సోమవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

    అన్ని ఉత్పత్తులపై ‘మేడ్ ఇన్ ఇండియా’ అని కనబడాలని, ఆ దిశగా ముందుకు సాగాలని అన్నారు. బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతూ... ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఓ మంత్రి అత్యాచారానికి పాల్పడ్డారని పరోక్షంగా హరతాళు హాలప్పపై ఆరోపణలు గుప్పించారు. నిండు అసెంబ్లీలో ఆ పార్టీ మంత్రులు తమ మొబైల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు చూస్తూ దొరికి పోయారని గుర్తు చేశారు. మంగళూరులో పబ్‌పై ఛాందసవాదులు దాడులకు పాల్పడిన సందర్భంగా మహిళలపై చేయి చేసుకున్నారని ఆరోపించారు.

    ఇలాంటి వారు మహిళలకు ఏ విధంగా శక్తినిస్తారో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఉత్తర కన్నడ జిల్లా శిరసిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీ హయాంలో అంతు లేని అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు జైలు పాలయ్యారని తెలిపారు.

    రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందిందంటే కాంగ్రెస్ కారణమని చెప్పుకున్నారు. బెంగళూరు దేశ ఐటీ రాజధానిగా ఆవిర్భవించడానికి కూడా తమ పార్టీయే కారణమని అన్నారు. కాంగ్రెస్ ద్వారా మాత్రమే దేశానికి సమర్థ నాయకత్వం లభిస్తుందన్నారు. దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి కాంగ్రెస్‌కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. అలవి గాని హామీలను గుప్పిస్తున్న పార్టీలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సభల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర పాల్గొన్నారు.
     
    దేశంలో అవీనితికి బీజేపీయే కారణం
     
    దేశంలో అవినీతి పెరగడానికి, మత కలహలు చెలరేగడానికి బీజేపీయే కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాయచూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవికి అనర్హుడని విమర్శించారు. మోడీ ఉన్మాదని, మతఛాందస భావాలు కలిగిన వ్యక్తిని అన్నారు.  మోడీ గుజరాత్‌లో మాత్రమే ప్రజల అభిమానాన్ని పొందారని, ఆయన అభిమానులు ఇతర రాష్ట్రాల్లో లేరని పేర్కొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement