పీడబ్ల్యూడీ అధికారులపై కొరడా! | The government suspended 22 engineers | Sakshi
Sakshi News home page

పీడబ్ల్యూడీ అధికారులపై కొరడా!

Sep 3 2015 3:25 AM | Updated on Sep 3 2017 8:37 AM

ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ)లో కాంట్రాక్టర్లలో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసకుంది

22 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
 
 సాక్షి, ముంబై : ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ)లో కాంట్రాక్టర్లలో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసకుంది. క్వాలిటీ కంట్రోల్ బోర్డు (నాణ్యత నియంత్రణ మండలి)కి తప్పుడు పత్రాలు సమర్పించి ఉత్తర ముంబై ప్రజా పనులు శాఖ (పీడబ్ల్యూడీ)లో అక్రమాలకు పాల్పడిన 22 మంది ఇంజనీర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు. కాగా, 19 మంది కాంట్రాక్టర్లను కూడా బ్లాక్ లిస్ట్‌లో చేర్చి వారికి ప్రభుత్వ సంబంధిత పనులు అప్పగించరాదని సూచించారు. ఒకేసారి 22 మంది ఇంజనీర్లపై వేటు వేయడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.

 ఇదీ జరిగింది...
 అంధేరీ వార్డు పరిధిలోని సంబంధిత ఇంజనీర్లు మాత్రం ఎలాంటి తనిఖీలు చేయకుండానే పనులు నాణ్యంగా జరుగుతున్నట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి సదరు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయించారు. కాగా, ఉత్తర ముంబై కార్యాలయంలో మంజూరు చేసిన బిల్లుల్లో అవకతవకలున్నాయని, వీటిని తిరిగి పరిశీలించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో నాగ్‌పూర్‌లోని కాగ్ కార్యాలయం అధికారులను ఆదేశించింది. దీంతో తనిఖీలు చేపట్టిన అధికార బృందానికి ఆశ్చర్యకరమైన నిజాలు తెలిశాయి. దాదాపు 22 మంది ఇంజనీర్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బిల్లులు మంజూరు చేయించారని వెల్లడైంది. ఈ తతంగంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు బయటపడింది.

Advertisement
 
Advertisement
Advertisement