మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అధికారులు రూ. 40 కోట్ల విలువైన ఎనిమిది కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు.
రూ.40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
Sep 28 2013 11:00 PM | Updated on Sep 1 2017 11:08 PM
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అధికారులు రూ. 40 కోట్ల విలువైన ఎనిమిది కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ఈ మాదకద్రవ్యాన్ని శుక్రవారం స్థానిక ఐదు నక్షత్రాల హోటల్లో స్వాధీనం చేసుకొని అమోబీ చిజిఓకే ఒబినికా అనే నైజీరియన్ను అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలో ఓ ఖరీదైన లాడ్జికి అమోబీ దీనిని తీసుకెళ్తుండగా అరెస్టు చేశామని ఎన్సీబీ తెలిపింది. వారి కథనం ప్రకారం.. ఈ ఏడాది ఇంత భారీగా కొకైన్ పట్టుబడడం ఇదే తొలిసారి. ఇది చాలా ప్రమాదకరమైన మాదకద్రవ్యం కావడంతో మత్తుమందుల వ్యవసపరులు దీనిని తీసుకోవడానికి చాలా ఇష్టపడుతారని ఎన్సీబీ డెరైక్టర్ జనరల్ ఆర్పీ సింగ్ తెలిపారు.
అయితే ఈ నెల 26న ఢిల్లీకి వచ్చిన నిందితుడు కొకైన్ను తన వెంట తీసుకురాకుండా వేరే విమానంలో పార్సిల్ బుక్ చేశాడు. మరునాడు అది ఇతని హోటల్ గదికి కొరియర్లో రావాల్సి ఉంది. ఇతని కదలికలపై పక్కా సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు నిఘా వేశారు. హోటల్ లాబీలో ఇతడు కొరియర్ కోసం ఎదురుచూస్తుండగానే అరెస్టు చేశారు. అమోబీపై మాదకద్రవ్యాల చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశామని, అయితే ఇది ఎవరి కోసం తీసుకొచ్చాడో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సింగ్ చెప్పారు. విద్యార్థులకు భారీగా డ్రగ్స్ అందుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో పటిష్ట నిఘా ఉంచామని తెలిపారు. అన్మోల్ సర్నా అనే ఎన్ఐఆర్ విద్యార్థి ఇటీవల మాదకద్రవ్యాలు వికటించడంతో హింసాత్మకంగా మారి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించడం తెలిసిందే.
Advertisement
Advertisement