పర్యాటకులకు ‘మెట్రో మ్యాప్’ | Metro to come up with guide for multimodal travel | Sakshi
Sakshi News home page

పర్యాటకులకు ‘మెట్రో మ్యాప్’

Sep 4 2014 11:03 PM | Updated on Oct 16 2018 5:16 PM

జాతీయ రాజధానిలో పలు ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు ఇబ్బం దులు తొలగిపోయినట్లే.. నగరంలో పర్యాటక ప్రాంతాల సంఖ్య ఎక్కువే..

 న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో పలు ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు ఇబ్బం దులు తొలగిపోయినట్లే.. నగరంలో పర్యాటక ప్రాంతాల సంఖ్య ఎక్కువే.. దేశ రాజధాని కావడంతో విదేశీయులు ఎక్కువగా ఇక్కడ ప్రదేశాలను సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే వారికి ఇంతకుముందు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లడానికి సరైన మార్గదర్శకం లేక ఇబ్బందులు పడేవారు. అటువంటి పర్యాటకుల సౌకర్యార్థం ఢిల్లీ మెట్రో ఒక రూట్ మ్యాప్‌ను తయారుచేస్తోంది. మెట్రో కారిడార్లు, మెట్రో ఫీడర్ సర్వీసులు, డీటీసీ బస్సుల సేవలను అనుసంధానించి ఈ రూట్‌మ్యాప్‌ను తయారుచేస్తున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మెట్రో, డీటీసీ రూట్ల అనుసంధానంపై సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో సందర్శకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ మ్యాప్‌లో ఫేజ్-3 సహా మొత్తం మెట్రో నెట్‌వర్క్, మెట్రో ఫీడర్ బస్ సేవలను గుర్తిస్తారు.
 
 అలాగే ఆయా మెట్రో స్టేషన్లకు సమీపంలో అందుబాటులో ఉండే డీటీసీ బస్సుల గురించి కూడా సమాచారం ఉంటుంది. మ్యాప్‌లో సమీప రైల్వే స్టేషన్లతో పాటు ముఖ్యమైన సందర్శక ప్రదేశాలను క్రమపద్ధతిలో గుర్తిస్తారు. ఈ విషయమై మెట్రో అధికార ప్రతినిధి అనుజ్ దయాల్ మాట్లాడుతూ.. ఈ మ్యాప్ మెట్రో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇందులో మెట్రో ఫేజ్-3 లైన్‌లతో సహా మొత్తం నెట్‌వర్క్ సమాచారంతోపాటు, ఫీడర్ బస్ సర్వీస్, డీటీసీ బస్ రూట్లకు సంబంధించిన సమాచారం పొందుపరచబడి ఉంటుందన్నారు. ఈ మ్యాప్‌లో పలు స్థాయిలలో సమాచారం అందించబడుతుందని ఆయన వివరించారు. ఉదాహరణకు.. ఫీడర్ బస్ సర్వీస్‌కు , సమీప మెట్రో స్టేషన్ మధ్య ఉన్న సంబంధాన్ని మొదటి స్థాయిలో చూపిస్తే.. మెట్రోస్టేషన్‌కు సమీప బస్‌స్టాప్‌లో అందుబాటులో ఉండే డీటీసీ రూట్ల గురించి రెండో స్థాయిలో సమాచారం పొందుపరచబడి ఉంటుందన్నారు.
 
 ఢిల్లీ- గుర్గావ్ కారిడార్‌కు అందుబాటులో ఉండే డీటీసీ బస్ రూట్లను ఈ మ్యాప్‌లో పసుపు రంగు లైన్‌తో సూచిస్తారని ఆయన ఉదహరించారు. ఈ మ్యాప్‌కు సంబంధించి మొదటి ప్రచురణ మరో రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని దయాల్ తెలిపారు. వాటిని మెట్రో స్టేషన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఫేజ్-3లోని కారిడార్లను సందర్శకులు మ్యాప్‌లో సులభంగా గుర్తించేందుకు వివిధ రంగులను వాడాలని డీఎంఆర్‌సీ నిర్ణయించింది.  ముకుంద్‌పూర్ నుంచి శివ్  విహార్ వరకు ఉన్న కారిడార్(ఏడవలైను)కు ‘పింక్’, పశ్చిమ జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్(లైన్ 8) వరకు వ్యాపించి ఉన్న కారిడార్‌ను గుర్తించేందుకు గులాబీ రంగును వాడాలని నిర్ణయం తీసుకుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement