సాక్షి, చెన్నై : ఎడపాడి, ఓపీఎస్ వర్గాలు జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికలను కైవసం చేసుకోవడం సాధ్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఓ.పన్నీర్సెల్వం వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల సమావేశం సోమవారం చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో నాలుగు ముఖ్య తీర్మానాలు ప్రవేశపెట్టారు. అందులో ఒకటి జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. జయలలిత ప్రారంభించిన అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్నది వీరి లక్ష్యంగా ఉంది.
ఇందులో భాగంగానే పై తీర్మానం ప్రవేశపెట్టారు. ఇందుకు దినకరన్ మద్దతుదారుడైన నాంజిల్ సంపత్ తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఈ రెండు వ్యక్తిగత ఆస్తులని అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఎవరికీ హక్కు లేదని తెలిపారు. ఆ తరువాత జయ టీవీ సీఈఓ వివేక్ జయరామన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఇళవరసి కుమారుడు. వివేక్ జయరామన్ తన ప్రకటనలో జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక ప్రైవేటు సంస్థలని పేర్కొన్నారు. వీటి స్వాధీనానికి తీర్మానం ప్రవేశపెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ మీడియాలు ఎవరికి చెందుతాయన్న ఆసక్తి నెలకొంది.